చిన్న పొరపాటు... 11 ఏళ్లుగా ఆమెకు అందని భర్త డెట్ సర్టిఫికెట్!
ABN , First Publish Date - 2021-09-18T15:41:44+05:30 IST
రాజస్థాన్లోని దౌసాలో ఒక మహిళ తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం...
దౌసా: రాజస్థాన్లోని దౌసాలో ఒక మహిళ తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం 11 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ పడరాని పాట్లు పడుతోంది. బాధితురాలు పార్లమెంటు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చివరకు ఆఫీస్ అసిస్టెంట్ల చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆమెకు భర్త డెత్ సర్టిఫికెట్ ఇంతవరకూ అందలేదు. బాధితురాలు గులాబ్ దేవి దౌసా జిల్లాలోని భామ్వత్ గ్రామంలో ఉంటుంది.
11 ఏళ్లు గడచినా భర్త డెత్ సర్టిఫికెట్ అందకపోవడంతో ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా మరికొందరు కూడా ధర్నాలో కూర్చున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త జయరామ్ మీణా 2010లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలోని ఒక కంపెనీలో పనిచేసేందుకు వెళ్లారు. 2010 సెప్టెంబరు 20న జయరామ్ మీణా మృతి చెందారు. అదేనెల 21న జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అయితే ఎంబామింగ్ సర్టిపికెట్లో ఆమె తండ్రి పేరు తేజారామ్కు బదులు బలరామ్ అని నమోదయ్యింది. దీని కారణంగా భర్త డెత్ సర్టిఫికెట్కు విలువ లేకుండా పోతున్నదని బాధితురాలు చెబుతోంది. ఈ నేపధ్యంలో ఆమె విశాఖపట్టణంలోని ఆసుపత్రి వర్గాలు చేసిన పొరపాటు కారణంగా తాను ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంది. ఈ పొరపాటును సరిదిద్దాలని కోరుతూ అధికారులను వేడుకుంటోంది.