ముగ్గురు పిల్లలున్న మహిళ వేరొకరితో సాన్నిహిత్యం.. చివరికి ఘోరం!

ABN , First Publish Date - 2020-11-13T12:15:35+05:30 IST

ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు

ముగ్గురు పిల్లలున్న మహిళ వేరొకరితో సాన్నిహిత్యం.. చివరికి ఘోరం!

  • భువనగిరిలో మహిళ దారుణ హత్య
  • బంజారాహిల్స్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్/భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రం శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరగగా, నిందితుడు భువనగిరి  పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన ఓ మహిళ (41) భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు వెళ్లి అక్కడ ఓ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే డ్రైవర్‌గా పని చేస్తున్న పెద్దమడుగుకు చెందిన ఆర్యకుమార్‌గౌడ్‌తో ఆమె సాన్నిహిత్యంగా ఉంటోంది. అయితే ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆర్యకుమార్‌కు అనుమానం మొదలైంది. విధుల నిమిత్తం బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆ మహిళ ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో, ఆమె పిల్లలు కంపెనీకి వెళ్లి ఆరా తీయగా విధులకు రానట్లు తెలిసింది. దీంతో వారు ఆర్యకుమార్‌కు ఫోన్‌ చేయగా అసభ్యంగా దూషిస్తూ ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదని చెప్పాడు.


దీంతో బుధవారం రాత్రి ఆమె కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కాగా ఆమెను తానే హత్య చేశానంటూ ఆర్యకుమార్‌ గురువారం భువనగిరి పట్టణ ఠాణాలో లొంగిపోయాడు. బుధవారం సాయంత్రం ఇద్దరం కలిసి బస్సులో హైదరాబాద్‌ నుంచి భువనగిరికి వచ్చి ఓ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ వద్దకు చేరుకున్నామని, అక్కడ ఇరువురి మధ్య డబ్బు, బంగారం విషయంలో వివాదం తలెత్తడంతో సర్జికల్‌ కత్తితో గొంతు కోసి తలపై బండరాయితో మోదీ హత్యచేసినట్టు చెప్పాడు. అనంత రం ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. పట్టణ ఇన్‌చార్జ్ సీఐ జానయ్య, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-11-13T12:15:35+05:30 IST