రెండు వారాల క్రితం అమ్మ.. ఇప్పుడు సోదరి
ABN , First Publish Date - 2021-05-07T10:12:06+05:30 IST
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం నెలకొంది. రెండు వారాల వ్యవధిలోనే ఆమె తల్లితో పాటు సోదరిని కరోనా బలి తీసుకొంది.
క్రికెటర్ వేద కృష్ణమూర్తికి కరోనా మిగిల్చిన విషాదం
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం నెలకొంది. రెండు వారాల వ్యవధిలోనే ఆమె తల్లితో పాటు సోదరిని కరోనా బలి తీసుకొంది. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా కడూరులోని ఓ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స తీసుకొంటున్న వేద సోదరి వత్సల శివకుమార్ (45) గురువారం మృతి చెందింది. పది రోజుల క్రితం ఆమె తల్లి చెళువాంబదేవి (63) కూడా కరోనాతో కన్నుమూసింది. దీంతో వేద తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.
రాజస్థాన్ ఆటగాడు మృతి:
కొవిడ్ బారినపడిన రాజస్థాన్ రంజీ క్రికెటర్ వివేక్ యాదవ్ (36) మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. లెగ్ స్పిన్నర్ వివేక్ 18 ఫస్ట్క్లాస్ మ్యాచ్లో 57 వికెట్లు తీశాడు. 2011లో రంజీ ట్రోఫీ నెగ్గిన రాజస్థాన్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. అలాగే వడోదరకు చెందిన ప్రముఖ క్రికెట్ గణాంకవేత్త దినార్ గుప్తే (76) కరోనాతో కన్నుమూశాడు.