భర్తను ముంబై వెళ్లకుండా ఆపి, తన ప్రాణాలు పోగొట్టుకుంది
ABN , First Publish Date - 2020-05-23T13:16:26+05:30 IST
జార్ఖండ్లోని విష్ణుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారుకుదార్ గ్రామంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త కరోనా ప్రభావిత రాష్ట్రానికి వెళ్ళకుండా భార్య అడ్డుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
హజారీబాగ్: జార్ఖండ్లోని విష్ణుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారుకుదార్ గ్రామంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త కరోనా ప్రభావిత రాష్ట్రానికి వెళ్ళకుండా భార్య అడ్డుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ముంబైలో బస్సు నడుపుతున్న వాసుదేవ్ మహతో లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకున్న వలసకార్మికులను సారుకుదార్ గ్రామానికి తీసుకువచ్చాడు. సుమారు ఏడాదిన్నర తర్వాత వాసుదేవ్ ఇంటికి రావడంతో అతని భార్య తిరిగి ముంబై వెళ్లవద్దని అతనిని కోరింది. అయితే తాను తప్పనిసరిగా ముంబై వెళ్లాలని భర్త చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలోనే భర్త డ్రైవర్ సీటులో కూర్చుని బస్సు స్టార్ట్ చేశాడు. అప్పటికీ భర్తను ఒప్పించే ప్రయత్నంలో ఉన్న భార్య కాలు తడబడటంతో బస్సు చక్రాల కింద పడిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన అదే బస్సులో ఉన్న మరొక డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.