బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసును తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులు!

ABN , First Publish Date - 2021-10-19T03:26:36+05:30 IST

బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు వెల్లడికాకుండా బాధితురాలిని బెదిరించి అధికార పార్టీకి కొమ్ము కాయడం దారుణమని కావలి ఉమెన్స్‌ ఫోర్స్‌ సభ్యులు పేర్కొన్నారు.

బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసును   తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులు!

కావలి, అక్టోబరు 18: బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు వెల్లడికాకుండా బాధితురాలిని బెదిరించి అధికార పార్టీకి కొమ్ము కాయడం దారుణమని కావలి ఉమెన్స్‌ ఫోర్స్‌ సభ్యులు పేర్కొన్నారు. కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను సోమవారం వారు పరామర్శించారు. అనంతరం జర్నలిస్టక్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఉమెన్స్‌ఫోర్స్‌ కన్వీనర్‌ చాకలకొండ శారద, కార్యదర్శి అమరజ్యోతి, ఎస్‌.ప్రభావతి, టీ.లక్ష్మి, కే.సుజాత మాట్లాడుతూ రెండు రోజుల కిందట కొండాపురం మండలంలో 13 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై  బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. తక్షణం డివిజన్‌ స్థాయి పోలీస్‌ అధికారి ఆ బాలికను పిలిపించి ఇది కేవలం ప్రేమికుల మధ్య జరిగిన ఘటనగా చెప్పమని బెదిరించి ఆమె సంతకం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాలికను విచారించి వాస్తవాలు తెలుసుకుని దిగ్ర్భాంతి చెందామని, బాలికపై నలుగురు మృగాళ్ల అత్యాచారం చేస్తే దానిని డివిజనల్‌ స్థాయి పోలీస్‌ అధికారి అధికారపార్టీ నేత ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించటంలో ఆంతర్యమేమిటన్నారు. చెన్నై నుంచి వచ్చిన ఆ బాలిక అత్యాచారానికి పాల్పడిన మృగాళ్లను ఎలా గుర్తించగలదన్నారు. ఒక వ్యక్తిని మాత్రమే గుర్తిస్తే మిగిలిన ముగ్గురిని పట్టుకోవాల్సిన పోలీసులు ఒక్కరే అత్యాచారం చేశారని రాయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేసును విచారిస్తున్న పోలీస్‌ స్పెషల్‌ డీఎస్పీ బాధిత బాలిక పక్షాన నిలబడి నిజాయితీగా ఆ నలుగురిపై ఫోక్సో, దిశ, అట్రాసిటీ కేసులు పెట్టి శిక్ష పడేలా చూడాలన్నారు. లేనిపక్షంలో ఉమెన్స్‌ఫోర్స్‌, చైల్డ్‌రైట్స్‌ ఫోరం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వామపక్షాలతో కలిసి బాధిత బాలికకు అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-10-19T03:26:36+05:30 IST