సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళ్లిన భార్య అదృశ్యం.. ఫోన్ IMEI నెంబర్‌తో ట్రేస్ చేస్తే వెలుగులోకి ఇద్దరమ్మాయిల సహజీవనం..!

ABN , First Publish Date - 2021-08-11T22:29:59+05:30 IST

కాలేజి నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని భార్య చెప్తే అతను నమ్మాడు. జాగ్రత్తగా వెళ్లిరా అంటూ సాగనంపాడు.

సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళ్లిన భార్య అదృశ్యం.. ఫోన్ IMEI నెంబర్‌తో ట్రేస్ చేస్తే వెలుగులోకి ఇద్దరమ్మాయిల సహజీవనం..!

ఇంటర్నెట్ డెస్క్: కాలేజి నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని భార్య చెప్తే అతను నమ్మాడు. జాగ్రత్తగా వెళ్లిరా అంటూ సాగనంపాడు. అలా వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవడంతో కంగారు పడ్డాడు. చివరకు ఊరంతా గాలించి వట్టి చేతులతో తిరిగొచ్చాడు. భార్యకేమైందో అనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా ఇదే సమయంలో అతని భార్య చదివిన కాలేజిలోనే చదువుకున్న మరో అమ్మాయి కూడా కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి కూడా సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి కాలేజీకి బయలుదేరింది. ఈ రెండు కేసులూ రిజిస్టర్ చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ నిజం తెలిసింది. అదేంటంటే.. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో అబద్ధం చెప్పి లేచిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని తలైవాసల్ ప్రాంతంలో వెలుగు చూసింది.


అదితి, అహల్య (పేర్లు మార్చడం జరిగింది) అనే ఇద్దరు యువతులు స్థానికంగా ఉన్న ఒక కాలేజిలో చదువుకున్నారు. చదువు పూర్తవగానే అదితికి తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ కూడా కాలేజీ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటామని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆపై ఒకరినొకరు కలుసుకున్నారు. అంతే ఇద్దరూ కలిసి చెన్నై పారిపోయి సహజీవనం చేయడం ప్రారంభించారు. అదితి భర్త, అహల్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. ఈ క్రమంలో ఈ రెండు వర్గాలూ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కంప్లయింట్లు ఇచ్చాయి.


ఈ కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అమ్మాయిల మొబైల్‌లో ఉండే ఐఎంఈఐ నంబర్ల సాయంతో వారిని ట్రేస్ చేశారు. చెన్నలో సహజీవనం చేస్తున్న జంటను చేరుకున్నారు. ఆ తర్వాత వారిద్దరినీ ఎవరి ఇళ్లకు వారిని పంపేశారు. ఇద్దరు మహిళలు కలిసి ఉండటం చట్టప్రకారం నేరమేమీ కాదని చెప్పిన పోలీసులు.. సదరు యువతులను తాము బలవంతంగా విడదీయలేదని వివరించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, తాము ఇది జోక్‌గా చేశామని ఆ యువతులు చెప్పారని పోలీసు శాఖ చెప్తోంది. అయితే ఇద్దరు యువతులు కుటుంబాలను వదిలేసి కలిసి జీవించాలని సరదాగా అనుకోరని, పోలీసులు ఏదో విషయం దాస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. అసలేం జరిగిందనేది ఆ యువతులే చెప్పాలి. కానీ వాళ్లు ఇప్పటి వరకూ ఎవరి ముందుకూ వచ్చి నోరు విప్పలేదు.

Updated Date - 2021-08-11T22:29:59+05:30 IST