తాళిబొట్టే గొంతుకోసె

ABN , First Publish Date - 2020-10-22T06:51:39+05:30 IST

నమ్ముకున్న భర్త.. అత్తమామల వేధింపులు తాళలేక వేర్వేరు ఘటనలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు మండలం కొడిచర్ల

తాళిబొట్టే గొంతుకోసె

 భర్త వేఽధింపులకు పసిగుడ్డు సహా ఆత్మహత్య 

 మరో ఘటనలో ఉరేసుకున్న వివాహిత 

కొత్తూర్‌, గుండాల, అక్టోబరు 21: నమ్ముకున్న భర్త.. అత్తమామల వేధింపులు తాళలేక వేర్వేరు ఘటనలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు మండలం కొడిచర్ల తండాలో స్వర్ణ  (23) అనే వివాహిత, తన 14 నెలల కూతురితో కలిసి నీళ్ల క్వారీలోకి దూకింది. బంధువులు గుర్తించి, వెలికితీసేసరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. భర్త రాజు తరచూ వేధింపులకు గురిచేస్తుండడంతోనే బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.


యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన నవనీత (23) దీ ఇదే తరహా విషాదాంతం. మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగుల సింహాద్రి కుమార్తె ఆమె. రామారం గ్రామానికి చెందిన ముక్కముల చంద్రయ్య కుమారుడు మహేశ్‌తో మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. మహేశ్‌ వ్యవసాయం చేస్తూ డీజే నడుపుతాడు. వరకట్నంగా నవనీత తల్లిదండ్రులు రూ.10లక్షల కట్నం ఒప్పుకొని పెళ్లి సమయంలో రూ.6 లక్షలు ఇచ్చారు. సాగులో నష్టాలు, ఇతర సమస్యలతో ఆమె తల్లిదండ్రులు మరో రూ.4లక్షలు ఇవ్వలేకపోయారు.


కట్నంలో మిగతా మొత్తం తేవాలంటూ, పిల్లలు పుట్టడం లేదంటూ పెళ్లయిన ఆరు నెలల నుంచే భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. గొడవలు ఎక్కువ కావడంతో నవనీత తల్లిదండ్రులు పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు, మహేశ్‌ను మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నవనీత ఈనెల 11వ తేదీన అత్తింట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అత్తింటి కుటుంబ సభ్యులు ఆమెను చూసి చికిత్స నిమిత్తం మోత్కూరు ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ నవనీత బుధవారం మృతి చెందింది. తండ్రి సింహాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుండాల ఎస్‌ఐ చందర్‌ తెలిపారు.


Updated Date - 2020-10-22T06:51:39+05:30 IST