ప్రాణాలైనా వదుల్తాం.. సరిహద్దులను వీడం: టికాయత్

ABN , First Publish Date - 2021-09-06T00:06:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకూ మూడు సాగు చట్టాలపై సాగిస్తున్న రైతు ఆందోళనలను కొనసాగిస్తామని..

ప్రాణాలైనా వదుల్తాం.. సరిహద్దులను వీడం: టికాయత్

ముజఫర్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకూ మూడు సాగు చట్టాలపై సాగిస్తున్న రైతు ఆందోళనలను కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ అన్నారు. విజయం సాధించేంత వరకూ ఢిల్లీ సరిహద్దులను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కిసాన్ మహాపంచాయత్‌లో ఆయన మాట్లాడుతూ.. ''నిరసనల స్థలాన్ని రైతుల సమాధి స్థలంగా మార్చినా నిరసన స్థలిని విడిచిపెట్టేది లేదని ప్రతినబూనుదాం. అవసరమైతే ప్రాణాలు వదులుదాం. మనం గెలుపు సాధించేంత వరకూ నిరసన స్థలాన్ని వదిలి వెళ్లం'' అని అన్నారు.


ప్రభుత్వ చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామని, కానీ రైతుల డిమాండ్లు నెరవేరేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా టికాయత్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటం 90 ఏళ్ల పాటు జరిగితే, ఈ ఆందోళన కూడా చాలాకాలం జరిగేలా కనిపిస్తోందని అన్నారు. కాగా, రైతు మహాపంచాయత్‌లో హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2021-09-06T00:06:40+05:30 IST