వర్క్‌ఫ్రం హోం కోసం యువతి గూగుల్‌లో వెతకగా...

ABN , First Publish Date - 2021-07-10T15:09:23+05:30 IST

వర్క్‌ఫ్రం హోమ్‌ కోసం గూగుల్‌లో వెతికిన యువతి

వర్క్‌ఫ్రం హోం కోసం యువతి గూగుల్‌లో వెతకగా...

  • సైబర్‌ నేరగాడికి చిక్కిన యువతి
  • యాప్స్‌లో పెట్టుబడి పేరుతో..
  • రూ.6.47లక్షలకు కుచ్చుటోపీ
  • నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ : వర్క్‌ఫ్రం హోమ్‌ కోసం గూగుల్‌లో వెతికిన యువతి సైబర్‌ నేరగాడి చేతికి చిక్కింది. అతడి మోసపూరిత మాటలు నమ్మి రూ. 6.47లక్షలు మోసపోయింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధికి చెందిన యువతి   వర్క్‌ఫ్రం హోమ్‌ పనికోసం గూగుల్‌లో వెతికింది. ఒక మొబైల్‌ నంబర్‌తో ప్రకటన కనిపించడంతో ఫోన్‌ చేసింది. యాప్స్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. వెంటనే జిప్‌బిట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేయాలని సూచించాడు. దాంతో ఆమె అతను చెప్పిన విధంగా చేసింది. ఆమెకు యూసర్‌ ఐడీ పాస్‌వర్డ్‌లు ఇచ్చిన నిందితుడు  ప్రారంభంలో రూ.500లు నుంచి పెట్టుబడి పెట్టాలని సూచించాడు. 


అలా పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చినట్లు చూపించాడు. అలా మెల్లమెల్లగా రూ.6,47,500లు పెట్టుబడి పెట్టిన తర్వాత విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ లేకుండా చేశాడు. దాంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ రంగంలోకి దిగి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నెల్లూరుకు చెందిన తమ్ము అనీల్‌ కుమార్‌గా నిందితున్ని గుర్తించారు. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతను టెక్నాలజీపై అవగాహన పెంచుకొని సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-07-10T15:09:23+05:30 IST