లేబర్‌ అడ్డా నుంచి పనికోసం వెళ్లిన మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-06-10T14:06:20+05:30 IST

లేబర్‌ అడ్డా నుంచి పనికోసం వెళ్లిన మహిళ కార్మికురాలు దారుణ హత్యకు

లేబర్‌ అడ్డా నుంచి పనికోసం వెళ్లిన మహిళ దారుణ హత్య

హైదరాబాద్ సిటీ/లంగర్‌హౌజ్‌ : లేబర్‌ అడ్డా నుంచి పనికోసం వెళ్లిన మహిళ కార్మికురాలు దారుణ హత్యకు గురైన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చిన్నమ్మ(45), ఆంజనేయులు భార్యభర్తలు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరంలోని షేక్‌పేట్‌ సక్కూభాయ్‌నగర్‌కు వచ్చారు. వీరికి  ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రోజూ అడ్డాకు వెళ్లి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మణికొండ లేబర్‌ అడ్డాపైకి భార్య భర్తలు కూలి పని కోసం వెళ్లారు. ఓ వ్యక్తి తన ఇంట్లో గదులకు ప్లాస్టింగ్‌ పని ఉందని, ఒక మహిళ అవసరం ఉందని తెలపడంతో ఆంజనేయులు చిన్నమ్మను పంపించాడు. సాయంత్రం అయినా చిన్నమ్మ తిరిగి రాకపోవడంతో తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్‌ చేశాడు. బుధవారం ఉదయం కూడా ఆయా ప్రాంతాల్లో ఆమెను వెతికారు. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండడంతో ఎక్కడైనా పడిపోయిందేమోనని భర్త ఆంజనేయులు తనకు తెలిసిన వ్యక్తులతో ఆయా ప్రాంతాల్లో గాలించాడు. అయినా ఆచూకీ దొరకలేదు.


సక్కుభాయ్‌ శ్మశాన వాటికలో..

షేక్‌పేట్‌ సక్కుభాయ్‌ శ్మశానవాటికలో ఓ మహిళ మృతి చెందిందన్న విషయాన్ని స్థానికులు గమనించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మృతి చెందిన మహిళను పరిశీలించారు. ఎవరో ఆమెను తలపై కొట్టి చంపి పడేశారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెను చిన్నమ్మగా గుర్తించారు. మహిళను అత్యాచారం చేసి చంపి ఉంటారా? కూలి కోసం తీసుకెళ్లిన వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూలికి తీసుకెళ్లిన వ్యక్తి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ ఉండడం పోలీసులకు మరింత అనుమానాన్ని రేకెత్తించింది. భర్త ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-10T14:06:20+05:30 IST