కూలీలకు సకాలంలో వేతనాలందించాలి
ABN , First Publish Date - 2022-04-08T05:52:16+05:30 IST
ఉపాధి కూలీలకు సరైన సమయంలో వేతనాలందేలా చూడాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ శ్రీహర్ష
- ధరూరు మండలంలో పర్యటన
ధరూరు, ఏపిల్ర్ 7 : ఉపాధి కూలీలకు సరైన సమయంలో వేతనాలందేలా చూడాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ధరూరు మండలం లోని గూడెందొడ్డిలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. మొత్తం 815 మంది కూలీలు పనులకు హాజరవుతున్నట్లు అధి కారులు ఆయనకు తెలిపారు. చెరువుకట్ట మరమ్మతుతో పాటు గ్రామంలో ఫీడర్ చానెల్ పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం 11 గంట లకే పనులు ముగించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులతో మాట్లాడారు. బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. ఆయన వెంట ఏపీడీ నాగేంద్రం, ఏపీవో సుజాత, ఎంపీడీవో జబ్బార్, ఎంపీవో కృష్ణమోహన్, ఉపాధి అధికారులు ప్రవీణ్, ప్రసన్న, సర్పంచ్ రఘువర్ధన్రెడ్డి ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో రెడ్క్రాస్
గద్వాల క్రైం : ఇండియన్ రెడ్క్రాస్ కమిటీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్క్రాస్ సంస్ధ కార్యక్రమాల నిర్వహణకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. శాశ్వత భవన నిర్మాణం కోసం కేఎల్ఐ ప్రాంతంలో స్ధలం సేకరిస్తామన్నారు. సంస్ధను బలోపేతం చేసేందుకు అన్ని మండలాల్లో తహసీల్దార్ల పర్యవేక్షణలో మండల కమిటీలను ఏర్పాటుకు ప్రత్యేక ఉత్వర్వులు జారీ చేస్తామని చెప్పారు. మండలాల్లో కూడా సేవలను అందించేలా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు. అనంతరం రెడ్క్రాస్ కమిటీ సభ్యులకు యాప్రాన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సంగాల అయ్యపురెడ్డి, కృష్ణయ్య, గంగాధర్గౌడు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
అయిజ టౌన్ : వ్యర్థాలను శుద్ధిచేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. అయిజ మునిసిపాలిటీలోని ఐదవ వార్డులో ఉన్న పర్దిపూర్ డంపింగ్ యార్డులో డీఆర్సీసీ, ఎఫ్ఎస్టీపీ షెడ్ల నిర్మాణాన్ని గురువారం కమిషనర్ నర్సయ్య, ఏఈ గోపాల్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు చుట్టూ తిరిగి వెళ్లడంతో సమయం, ఇంధనం ఖర్చు పెరగడంతో బాటు, ఇబ్బందులు పడాల్సి వస్తుంద న్నారు. ప్రత్యాన్మాయ రహదారి ఏర్పాటు చేస్తే దూరం తగ్గి, రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా అనువుగా ఉంటుందన్నారు. సేకరించిన చెత్త నుంచి తడి చెత్తను వేరు చేసి ఎరువును తయారు చేస్తామన్నారు. పట్టణం లో సేకరించిన మల వ్యర్థాలను ఎఫ్ఎస్టీపీ ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధిచేసి ఎరువుగా మార్చ వచ్చని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ చుట్టూ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 25 శాతం పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చెప్పారు.