కోవిడ్-19పై భారత్ పోరును ప్రపంచం మెచ్చుకుంటోంది : అమిత్ షా

ABN , First Publish Date - 2020-07-12T17:25:01+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశం విజయవంతంగా పోరాడుతోందని,

కోవిడ్-19పై భారత్ పోరును ప్రపంచం మెచ్చుకుంటోంది : అమిత్ షా

గురుగ్రామ్ : కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశం విజయవంతంగా పోరాడుతోందని, దీనిని ప్రపంచం ముక్తకంఠంతో ప్రశంసిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చెప్పారు. హర్యానాలోని కదర్‌పూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 


సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నాయి.  హర్యానాలోని కదర్‌పూర్ గ్రామంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ, మన దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భద్రతా దళాల పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక జనాభాగల దేశాల్లో భారత దేశం ఒకటి అని చెప్పారు. మన దేశం కోవిడ్-19పై ఎలా పోరాడగలదు? అని అందరూ అనుకున్నారన్నారు. చాలా మంది భయాలు వ్యక్తం చేశారన్నారు. అయితే కోవిడ్-19పై అత్యంత విజయవంతమైన పోరాటాల్లో ఒకటి మన దేశంలో ఎలా జరుగుతోందో ప్రపంచం నేడు గమనిస్తోందని చెప్పారు. 


‘‘కోవిడ్-19పై భారత దేశం చేస్తున్న యుద్ధంలో, మన భద్రతా దళాలు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాయి, దీనిని ఎవరూ కాదనలేరు. నేడు ఈ కరోనా యోధులకు గౌరవ వందనం చేస్తున్నాను. వారు ఉగ్రవాదంపై మాత్రమే కాకుండా ప్రజల సహకారంతో కోవిడ్‌పై కూడా పోరాడగలమని రుజువు చేశారు’’ అని అమిత్ షా అన్నారు. 


ఈ మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రాణ త్యాగం చేసిన జవాన్లకు నివాళులర్పించారు. తాను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, ఇప్పుడు మరోసారి వారికి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ‘‘మీ త్యాగాలు వృథా కాబోవు. కోవిడ్-19పై పోరాటం గురించి మానవ జాతి చరిత్రలో ఎప్పుడు రాసినా, భారత దేశ భద్రతా దళాల కృషి గురించి సువర్ణాక్షరాలతో లిఖించడం తథ్యం’’ అని పేర్కొన్నారు. 


మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచిదని చెప్తూ, ఈ మొక్కలను పెంచే బాధ్యతను జవాన్లు చేపట్టాలన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే మొక్కలను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. 


Updated Date - 2020-07-12T17:25:01+05:30 IST