వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్: నాలుగో రోజు వానగండం..?
ABN , First Publish Date - 2021-06-21T17:01:32+05:30 IST
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్కు వానగండం ముప్పు పొంచివుంది. ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు తప్పడం లేదు. నాల్గవరోజైన మ్యాచ్ సవ్యంగా సాగుతుందా..అసలు ఒక్క సెషన్
సౌథాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్కు వానగండం ముప్పు పొంచివుంది. ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు తప్పడం లేదు. నాల్గవరోజైన మ్యాచ్ సవ్యంగా సాగుతుందా..? అసలు ఒక్క సెషన్ కూడా కాకముందే మ్యాచ్ నిలిపివేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. సోమవారం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా అయితే..ఆట సాగే పరిస్థితి లేనట్లే. నాల్గవ రోజైన వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇప్పటికే టెస్టు మ్యాచ్లో ఐదు రోజుల్లో ఒక రోజు వృథాగా పోయింది. రెండో రోజు కూడా రెండు సెషన్లు మాత్రమే ఆట సాగింది. ఇక మూడో రోజు విషయానికి వస్తే..అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 92.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. రహానె (117 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (132 బంతుల్లో 1 ఫోర్తో 44) ఫర్వాలేదనిపించారు. బౌల్ట్, వాగ్నర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత కివీస్ ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. కాన్వే (153 బంతు ల్లో 6 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీ సాధించాడు. క్రీజులో విలియమ్సన్ (12 బ్యాటింగ్), టేలర్ (0 బ్యాటింగ్) ఉన్నారు. అశ్విన్, ఇషాంత్ చెరో వికెట్ తీశారు.