నిలువ నీడ లేదు

ABN , First Publish Date - 2021-06-22T04:51:48+05:30 IST

మొయినాబాద్‌ మండలంలో బస్‌ షెల్టర్లు లేక

నిలువ నీడ లేదు
మొయినాబాద్‌ మండల కేంద్రంలో బస్సుల కోసం రోడ్డు పక్కనే నిల్చున్న ప్రయాణికులు(ఫైల్‌)

  • మొయినాబాద్‌ మండల పరిధిలో అధ్వానంగా బస్‌ షెల్టర్లు
  • కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • కొన్నిచోట్ల బస్‌ షెల్టర్లు కరువు


మొయినాబాద్‌ రూరల్‌: మొయినాబాద్‌ మండలంలో బస్‌ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి వెంట ఉన్న కొన్ని గ్రామాల వద్ద బస్‌ షెల్టర్లు ఉన్నా కనీస వసతులకు నోచుకోవడం లేదు. మరికొన్ని గ్రామాల వద్ద అసలు బస్‌ షెల్టర్లే లేవు. ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండాలంటే నిలువ నీడ ఉండటం లేదు. రోడ్డు పక్కనే బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సుల రాక ఆలస్యమైతే గంటల తరబడి ఎండకు ఎండాల్సి వస్తోంది.. వానకు తడవాల్సి వస్తోంది. మండలంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి వెంట ఉన్న కొన్ని గ్రామాల వద్ద నిర్మించిన బస్‌ షెల్టర్లలో కనీస వసతులు లేక ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. నగరానికి కూతవేటు దూరంలో ఉండి.. జాతీయ రహదారి ఉన్నప్పటికీ బస్‌ షెల్టర్లు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు.  

మొయినాబాద్‌ మండల పరిధిలో అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. దీంతో రోజుకు కొన్ని వేలమంది విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. విద్యాసంస్థలు తెరిచి ఉన్నప్పుడు వివిధ గ్రామాల వద్ద బస్‌షెల్టర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. జోరువాన కురిసిందంటే  పక్కన ఉన్న దుకాణాల వద్దకు పరిగెత్తాల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంకా విద్యా సంస్థలు తెరవకపోయినా.. మరో పది రోజుల్లో తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్టాపుల్లో మళ్లీ విద్యార్థులకు అవస్థలు తప్పేట్లు లేవు.

అసలే ఈ ప్రాంతానికి అరకొర బస్సులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.. బస్‌ షెల్టర్లలో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. మొయినాబాద్‌ మండలంలో ప్రధానంగా హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరించి ఉంది. మండలపరిధిలో గల అజీజ్‌నగర్‌ చౌరస్తా, హిమాయత్‌నగర్‌ చౌరస్తా, జేబీఐఈటీ ఆమ్డాపూర్‌ చౌరస్తా, మొయినాబాద్‌ మండల కేంద్రం, కనకమామిడి చౌరస్తా, చిన్నషాపుర్‌ గేట్‌, కేతిరెడ్డిపల్లి, తోలుకట్ట చౌరస్తాలలో ఏర్పాటు చేసిన బస్‌ షెల్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందుబాబులు రాత్రి వేళలో తాగి బస్‌ షెల్టర్లలో సీసాలు పగల గొట్టి నానాబీభత్సం చేస్తున్నారు. కొన్ని బస్‌షెల్టర్లలో  చెత్తా చెదారం పడి ఉండటంతోపాటు పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో బస్టాపుల్లో ప్రయణికులు నిలబడాలంటేనే జంకుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అవసరమైనచోట్ల బస్‌స్టాపులు నిర్మించాలని, అధ్వానంగా తయారైన బస్టాపులకు మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 


బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలి 

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బస్‌ షెల్టర్లు సక్రమంగా లేవు. అధ్వానంగా ఉన్న బస్‌ షెల్టర్ల వద్ద వానకు, ఎండకు నిలబడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొయినాబాద్‌ మండల పరిధిలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయా చౌరస్తాల వద్ద కనీస వసతులతో బస్‌ షెల్టర్లను ఏర్పాటు చేయాలి. కొన్ని బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రయాణికుల అవస్థలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలి.            

- తూర్పు శ్రీనివాస్‌రెడ్డి, అజీజ్‌నగర్‌



Updated Date - 2021-06-22T04:51:48+05:30 IST