అధ్వానంగా రహదారులు

ABN , First Publish Date - 2021-12-05T07:30:50+05:30 IST

మండలంలోని పలు ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరాయి. ఆ రహదారుల వెంబడి ప్రయాణించలేక వాహన చోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

అధ్వానంగా రహదారులు
అద్దంకి దర్శిరోడ్డుపై పడిన గుంత

హడలిపోతున్న వాహనచోదకులు

ముండ్లమూరు, డిసెంబరు 4 : మండలంలోని పలు ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరాయి. ఆ రహదారుల వెంబడి ప్రయాణించలేక వాహన చోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై అడుగడుగునా గుంటలు పడ్డాయి. కనీసం సంబంధిత ఆర్‌అండ్‌బీ  అధికారులు మరమ్మతులు చేసిన దాఖలాలు కూడా లేవు. ఏడాది కాలం నుంచి  కనీసం మర్మతులు కూడా లేకపోవడంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి. 

మండలంలోని ప్రధాన రహదారుల్లో అద్దంకి - దర్శి  ముఖ్యమైన రహదారి. ఈ రహదారిపై పులిపాడు, రెడ్డినగర్‌, పెదఉల్లగల్లు, పసుపుగల్లు, శంకరాపురం గ్రామాల వద్ద రహదారులు గోతులు పడ్డాయి. దీంతో రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళ గోతుల్లో పడి వాహన చోదకులు నిత్యం ఆస్పత్రుల పాలవుతున్నారు. అద్దంకి - దర్శి ప్రధాన రహదారి కావడంతో సుదూర ప్రాంతాలైన కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల వారు నిత్యం ఈ రహదారిపై ప్రయాణం సాగిస్తుంటారు. వీరికి ఈ రోడ్డుపై పూర్తి అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాల భారిన పడుతున్నారు. సాధారణంగా ముండ్లమూరు నుంచి అద్దంకికి 15 నిమిషాల సమయం పడుతుంది. అలాంటిది ఈ గోతులతో దాదాపు గంట సమయం పడుతుంది. దర్శివైపు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక రెడ్డిపాలెం నుంచి ఈదర వెళ్లే ప్రధాన రహదారి కూడా అధ్వాన స్థితికి చేరింది. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు అంతా గోతుల మయమై పోయింది. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం సంబంధిత అధికారులు రహదారులను సందర్శించి మరమ్మతులైనా చేసి ప్రయాణికులు సాఫీగా ప్రయాణం సాగే విధంగా చూడాలని ఆయన గ్రామాల ప్రజలతో పాటు వాహన చోదకులు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-12-05T07:30:50+05:30 IST