కలగలిపి.. లక్ష్యాన్ని మరిచి!

ABN , First Publish Date - 2022-01-24T05:06:34+05:30 IST

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా క్షేత్రస్థాయిలో ‘స్వచ్ఛ’ లక్ష్యాలు నెరవేరడం లేదు. అధికారులు నిర్లక్ష్యం, కిందిస్థాయి సిబ్బంది అవగాహనారాహిత్యంతో పారిశుధ్య వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. ప్రజలు తడి, పొడిచెత్తను వేరుచేసి ఇస్తున్నప్పటికీ డంపింగ్‌యార్డుల వద్ద ఇష్టానుసారంగా చెత్తను డంప్‌ చేస్తున్నారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కలగలిపి.. లక్ష్యాన్ని మరిచి!
మెదక్‌లోని డంప్‌యార్డులో కుప్పగా పోసిన చెత్త

స్వచ్ఛసర్వేక్షణ్‌పై పర్యవేక్షణ కరువు

తడి, పొడిచెత్త కలిపి సేకరణ

ఓకేచోట కుప్పలుగా పోసి కాల్చేస్తున్న సిబ్బంది


మెదక్‌ మున్సిపాలిటి, జనవరి 23: ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా క్షేత్రస్థాయిలో ‘స్వచ్ఛ’ లక్ష్యాలు నెరవేరడం లేదు. అధికారులు నిర్లక్ష్యం, కిందిస్థాయి సిబ్బంది అవగాహనారాహిత్యంతో పారిశుధ్య వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. ప్రజలు తడి, పొడిచెత్తను వేరుచేసి ఇస్తున్నప్పటికీ డంపింగ్‌యార్డుల వద్ద ఇష్టానుసారంగా చెత్తను డంప్‌ చేస్తున్నారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడా చెత్త సెగ్రిగేషన్‌ చేయడం  లేదు. తడి, పొడి చెత్తను కలిపేసి గుట్టలుగా పోస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డుల వద్ద సౌకర్యాలు కరువయ్యాయి. సరిపడా స్థలం లేదు, చెత్తను చేరవేసే వాహనాలు చేరుకోవడానికి సరైన రహదారులు కూడా లేవు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డు కోసం రూ. కోటి 15 లక్షలు కేటాయించినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. రామాయంపేట మున్సిపాలిటీలో రెండు షెడ్లు నిర్మించాలని తలపెట్టగా ఒక షెడ్‌ పనులు కొనసాగుతున్నాయి. రెండో షెడ్‌ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డు ఏర్పాటు కోసం ఇటీవల ఐదెకరాల స్థలాన్ని కేటాయించగా చదును చేసి పనులు ప్రారంభించారు. ఇక్కడ రూ. 35 లక్షలతో షెడ్‌ నిర్మాణం ఇంకా ప్రారంభించాల్సి ఉన్నది. మెదక్‌లో డంపింగ్‌యార్డు వద్ద అంతర్గత రహదారుల కోసం రూ. 20 లక్షలు కేటాయించగా కంకర పోసి అసంపూర్తిగా వదిలేశారు. ప్రహరీ నిర్మాణం కోసం రూ. 20 లక్షలు కేటాయించినా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రూ. 25 లక్షలతో నిర్మిస్తున్న సెగ్రిగేషన్‌ షెడ్డు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మెదక్‌ మినహా ఏ మున్సిపాలిటీలోనూ చెత్తతో వర్మికంపోస్టు తయారు చేయడం లేదు. 

Updated Date - 2022-01-24T05:06:34+05:30 IST