ఏదో ఒకరోజు ఇవాంకా ట్రంప్‌ను తప్పకుండా కలుస్తా: జ్యోతి కుమారి

ABN , First Publish Date - 2020-05-25T22:37:06+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ అడ్వైజర్ ఇవాంకా

ఏదో ఒకరోజు ఇవాంకా ట్రంప్‌ను తప్పకుండా కలుస్తా: జ్యోతి కుమారి

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్‌ను ఏదో ఒకరోజు తప్పకుండా కలుస్తానని ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జ్యోతి కుమారి తెలిపింది. బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి త‌న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీట‌ర్ల మేర సైక్లింగ్ చేసి సొంతూరికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ వార్త భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో కూడా ట్రెండింగ్ అయింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడి కూతురే జ్యోతి వార్తపై ట్వీట్ చేశారంటే.. ఈ వార్త ఎంతలా ట్రెండ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి కుమారి ఏకంగా 1200  కిలోమీటర్లు సైక్లింగ్ చేయ‌డం ఆశ్చర్యానికి గురి చేసిందని ఇవాంక ట్వీట్ చేశారు. ఆమె అద్భుతమైన ఫీట్ చేసిందని, తన తండ్రిపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని ఆమె కొనియాడారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి అద్భుతమైన ఫీట్ సాధించడం గొప్ప విషయం అంటూ ట్వీట్ చేశారు. ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేసిన తరువాత జ్యోతి ఇంటి ముందు మీడియా క్యూ కట్టింది. మీడియా వాళ్లు చెప్పేంత వరకు తనకు ఇవాంకా ట్రంప్ ఎవరో కూడా తెలియదని జ్యోతి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకున్నానని.. ఏదో ఒకరోజు ఇవాంకా ట్రంప్‌ను తప్పకుండా కలుస్తానని జ్యోతి చెప్పింది.


కాగా.. జ్యోతి కుమారి ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఉపాధి నిమిత్తం ఆమె కుటుంబం గుర్‌గ్రామ్‌ చేరింది. తండ్రి మోహన్‌ పాసవాన్‌ ఆటోరిక్షా నడిపేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో ఆటోరిక్షా యజమాని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.. అంతకుముందే ప్రమాదంలో పాసవాన్‌ గాయపడడంతో లాక్‌డౌన్‌లో మరేదన్నా పని కూడా చేయలేకపోయాడు. దాంతో ఇంటి అద్దె కట్టలేని దుస్థితి. ఫలితంగా ఇంటి యజమాని ఖాళీ చేయాలని హుకుం జారీ చేయకముందే స్వస్థలానికి వెళ్లిపోవాలనుకుంది జ్యోతి. ఓ ట్రక్‌ డ్రైవర్‌ను అడిగితే దర్భాంగా వెళ్లేందుకు రూ. 6,500 అడిగాడు. కానీ వారి చేతిలో ఉన్న మొత్తమే రూ. 600. ఇక లాభంలేదని రూ. 500 పెట్టి ఓ పాత సైకిల్‌ కొని తండ్రిని వెనక కూర్చోబెట్టుకొని ఈనెల 10న జ్యోతి తన ప్రయాణం ప్రా రంభించింది. రోజుకు 100-150కి.మీ చొప్పున రాత్రనక పగలనక సైకిల్‌ తొక్కింది. ఎట్టకేలకు 1200 కి.మీ. దూరంలోని స్వస్థలానికి ఈనెల 18న చేరింది. ‘రాత్రుళ్లు సైకిల్‌ తొక్కినందుకు నేను భయపడలేదు. కానీ వాహనాలు వెనకనుంచి ఎక్కడ ఢీకొంటాయోనని ఆందోళన చెందా. అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు’ అని జ్యోతి చెప్పింది. 


ఆమె చేసిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు. అంతదూరం, అందునా వెనుక మరొకరు..విపత్కర పరిస్థితుల మధ్య జ్యోతి చూపిన పట్టుదలకు, తెగువకు, ఆమె శక్తి సామర్థ్యాలకు అచ్చెరువొందిన భారత సైక్లింగ్‌ సమాఖ్య (సీఎ్‌ఫఐ) ఆమెతో మాట్లాడి ట్రయల్స్‌కు ఢిల్లీ రావాలని కోరింది. జ్యోతి.. ట్రయల్స్‌లో సత్తాచాటితే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలోగల జాతీయ సైక్లింగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య చైర్మన్‌ ఓంకార్‌ సింగ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. జ్యోతి ప్రస్తుతం సెలబ్రిటీ అయిపోయింది. పదుల సంఖ్యలో టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ఇంటి ముందు జనం క్యూ కట్టడం ఆనందంగా ఉందని జ్యోతి చెబుతోంది. అనేక మంది తనతో సెల్ఫీ తీసుకోవాలని ఎగబడుతున్నారని పేర్కొంది. మరోపక్క ఎనిమిదో తరగతితో చదువు ఆపేసిన జ్యోతికి తొమ్మిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇస్తున్నట్టు దర్బాంగ్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 


Updated Date - 2020-05-25T22:37:06+05:30 IST