చైనా యాప్లపై మరో ఎటాక్.. ఈ సారి సైలెంట్గా..?
ABN , First Publish Date - 2020-08-05T23:18:46+05:30 IST
కొద్ది వారాల క్రితం భారత్ ప్రభుత్వం నిషేధిత 59 చైనా యాప్లను పోలిన క్లోన్లను నిషేధించింది. ఆ సమయంలో మొత్తం 47 యాప్లపై వేటు పడింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించినట్టు తెలుస్తోంది. ఇలా బ్యానైన వాటిల్లో షియోమీ కార్ప్, బైదూ బ్రౌజర్లు ఉన్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం భారత ప్రభుత్వం.. నిషేధిత 59 చైనా యాప్లను పోలిన క్లోన్లను బ్యాన్ చేసింది. ఆ సమయంలో మొత్తం 47 క్లోన్ యాప్లపై వేటు పడింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించినట్టు తెలుస్తోంది. గతంలో నిషేధానికి గురైన యాప్లకు చెందిన ప్రో, లైట్ వర్షెన్లు కూడా ప్రస్తుతం బ్యానయ్యాయని తెలిసింది. వీటిల్లో షావొమీ కార్ప్ బ్రౌజర్, బైదూ సెర్చ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఇది కొనసాగింపని కూడా విస్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వార్తలపై కేంద్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతే కాకుండా.. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, చైనా రాయాబార్య కార్యాలయం కూడా ఈ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించలేదని తెలుస్తోంది. భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని చైనా గతంలో ఆక్షేపించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. తాజా పరిణామంపై షవోమీ ప్రతినిధి స్పందించారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కలిగే ఫలితాలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే.. చైనా గూగుల్గా పేరుగాంచిన బైదూ మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి కామెంట్ చేయలేదు. ప్రస్తుతం షావోమీ భారత్లో నెం.1 స్మార్ట్ ఫోన్ కంపెనీ అన్న విషయంలో తెలిసిందే. హాంగ్కాంగ్కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ అంచనా ప్రకారం. భారత్లో షావోమీకి దాదాపు 9 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. తన స్మార్ట్ ఫోన్లలో షవోమీ పలు తప్పనిసరి యాప్లను చేరుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే షవోమీ బ్రౌజర్పై కూడా వేటుపడటంతో ఇకపై ఈ యాప్ లేకుండానే కంపెనీ తన ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.