యాదవులపై దాడులు ఆపకపోతే ఆందోళన తప్పదు
ABN , First Publish Date - 2022-01-21T02:39:19+05:30 IST
రాష్ట్రంలో రోజురోజుకు యాదవులపై దాడులు అధికమయ్యాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడులను ఆపకపోతే
సీతారామపురం, జనవరి 20 : రాష్ట్రంలో రోజురోజుకు యాదవులపై దాడులు అధికమయ్యాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడులను ఆపకపోతే ఆందోళన తప్పదని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్య యాదవ్ హెచ్చరించారు. నాంచారమ్మపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల మృతి చెందిన మూరిబోయిన తిరుపతయ్య కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పొలంలోకి దారి ఇవ్వనందునే చెన్నారెడ్డి అనే వ్యక్తి తిరుపతయ్యను అటవీ ప్రాంతంలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారని చెప్పారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకులు, అధికారులు చొరవ తీసుకుని తిరుపతయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే వింజమూరులో జరిగిన సురేష్యాదవ్ హత్యపై కూడా ఆయన స్పందించి బాధితులకు న్యాయం జరగకుంటే యాదవులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అనంతరం వివాదాస్పద పొలందారితోపాటు, అటవీ ప్రాంతంలో తిరుపతయ్య మృతి చెందిన స్ధలాన్ని పరిశీలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు కొల్లు మధుబాబు యాదవ్, పలువురు మండల యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.