జే-ట్యాక్స్ దండుకోవడం మోసం కాదా.? యనమల
ABN , First Publish Date - 2021-03-09T19:49:18+05:30 IST
మద్య నిషేధంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓట్లు వేయించుకుని.. జే-ట్యాక్స్ పేరిట దండుకోవడం మోసం కాదా.? అని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
అమరావతి: మద్య నిషేధంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓట్లు వేయించుకుని.. జే-ట్యాక్స్ పేరిట దండుకోవడం మోసం కాదా.? అని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంగళవారం యనమల మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు చేసిన తీరని ద్రోహాన్ని కప్పిపెట్టుకోవడానికే జెండర్ బడ్జెట్ గారడీ అని చెప్పారు. జెండర్ బడ్జెట్ కాదు.. జెండర్పై దౌర్జన్యాల బడ్జెట్... అని ఎద్దేవా చేశారు.అంకెల గారడీతో మహిళలను మోసం చేసే బడ్జెట్ అన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత మోసంపై సమాధానం చెప్పాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
చేయూతలో ఒక్కో మహిళకు రూ.1.05 లక్షల ద్రోహ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అక్రమ కేసులు పెట్టడం మహిళా స్వావలంబనా.?కాదా అని యనమల రామకృష్ణుడు నిలదీశారు. అమ్మఒడి సొమ్మును నాన్న బుడ్డీలో లాక్కోవడం మోసం కాదా.? అని ప్రశ్నించారు. రెండేళ్ల వైసీపీ పాలనలో 327 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.ఇసుక ధరలు పెంచి 67 మంది మహిళల పుస్తెలు తెంచారని మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలతో 767 మంది మహిళల పుస్తెలు తెంచారని చెప్పారు. మహిళలపై వైసీపీ అరాచకాలపై చర్యలు తీసుకోకుండా మహిళా అభ్యున్నతి ఏలా అవుతుందని నిలదీశారు. సొంత చెల్లెల్లకు న్యాయం చేయలేని వాడు.. మహిళాభ్యుదయమనడం హాస్యాస్పదంగా ఉందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.