‘పాదయాత్ర’ రైతులకు వైసీపీ ఎమ్మెల్యే పలకరింపు
ABN , First Publish Date - 2021-11-30T09:19:09+05:30 IST
‘ప్రస్తుతం మీరంతా ఉండేది నా నియోజకవర్గ పరిధిలోనే... భారీ వర్షాలు కురుస్తూ, వరదలు వస్తున్నాయి.. ఈ సమయంలో మీకు ఏ అవసరమున్నా నాకు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో సహాయం అందిస్తా’.. అని నెల్లూరు రూరల్ వైసీపీ..
- పార్టీలు, ఉద్యమాలతో నాకు సంబంధం లేదు
- వర్షాల్లో ఏ అవసరమున్నా ఫోన్ చేయండి.. సాయం చేస్తా
- రైతులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాటా మంతీ
నెల్లూరు రూరల్, నవంబరు 29: ‘ప్రస్తుతం మీరంతా ఉండేది నా నియోజకవర్గ పరిధిలోనే... భారీ వర్షాలు కురుస్తూ, వరదలు వస్తున్నాయి.. ఈ సమయంలో మీకు ఏ అవసరమున్నా నాకు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో సహాయం అందిస్తా’.. అని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అమరావతి రైతులతో అన్నారు. పార్టీలు, ఉద్యమాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. వర్షాల కారణంగా రెండ్రోజులుగా అమరావతి రైతులు పాదయాత్రకు విరామం ప్రకటించి.. నెల్లూరులోని కొత్తూరులో శాలివాహన కల్యాణ మండపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అంబాపురం, కొత్తూరు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కోటంరెడ్డి మార్గమధ్యంలో అమరావతి రైతులను కలిసి మాట్లాడారు. వర్షాలు, వరదల్లో చిక్కుకున్నందున వారికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని కోరారు. సాటి మనుషులుగా ఎలాంటి సహాయమైనా అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని చెప్పారు.