‘ఏమైనా ఉంటే హైకమాండ్‌తో మాట్లాడుకోండి’ : ఎమ్మెల్యేలపై యడియూరప్ప ఫైర్

ABN , First Publish Date - 2021-01-14T19:21:45+05:30 IST

కేబినెట్ కూర్పు విషయంలో విమర్శలకు దిగిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఏమైనా

‘ఏమైనా ఉంటే హైకమాండ్‌తో మాట్లాడుకోండి’ : ఎమ్మెల్యేలపై యడియూరప్ప ఫైర్

బెంగళూరు : కేబినెట్ కూర్పు విషయంలో విమర్శలకు దిగిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఏమైనా ఉంటే హైకమాండ్‌తో మాట్లాడండి. మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదు కదా. అక్కడా, ఇక్కడా విమర్శలకు దిగడం పద్ధతి కాదు. లేనిపోని గందరగోళాన్ని సృష్టించకండి.’’ అని తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైకమాండ్ సూచనలతో బుధవారం కేబినెట్ విస్తరణ చేశామని, అయితే ఒక పోస్ట్‌ను మాత్రం ఖాళీగా ఉంచామని, అదీ హైకమాండ్ సూచనతోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణలో అవకాశం దొరకలేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, అయితే తన శక్తివంచన లేకుండా, అందరికీ న్యాయం జరిగేలా కూర్పును చేశానని ఆయన తెలిపారు. తనకున్న పరిధిలో అన్ని అవకాశాలనూ ఉపయోగించుకున్నానని, కేబినెట్ విస్తరణపై కొందరు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించిందని, దానిని ఎవ్వరూ ఆపలేరని యడియూరప్ప అన్నారు. 

Updated Date - 2021-01-14T19:21:45+05:30 IST