యడియూరప్ప చాలా బలవంతుడు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు : కర్ణాటక మంత్రి

ABN , First Publish Date - 2021-07-21T18:09:03+05:30 IST

కర్ణాటకకు నూతన ముఖ్యమంత్రి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న

యడియూరప్ప చాలా బలవంతుడు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు : కర్ణాటక మంత్రి

బెంగళూరు : కర్ణాటకకు నూతన ముఖ్యమంత్రి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి బసవరాజ బొమ్మయ్ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. బుధవారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్ కూడా ఇదే చెప్పారన్నారు. ఊహాగానాలు, వదంతుల ద్వారా రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా బలంగా ఉన్నారని, ఆయనే తమ నేత అని చెప్పారు. 


మరోవైపు ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో యడియూరప్ప జూలై 25న బీజేపీ ఎమ్మెల్యేలకు విందు ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహణపై ఇప్పటి వరకు ఎటువంటి సంకేతాలు రాలేదు. ఈ నెల 26న బీజేపీ శాసన సభా పక్ష సమావేశం జరుగుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. 


యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ నెల 26తో రెండేళ్ళు పూర్తవుతాయి. ఆయన ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. 


 


Updated Date - 2021-07-21T18:09:03+05:30 IST