ఉత్తర ప్రదేశ్ విభజనపై యోగి ప్రభుత్వం క్లారిటీ

ABN , First Publish Date - 2021-06-12T23:37:39+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ను విభజించి, మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్..

ఉత్తర ప్రదేశ్ విభజనపై యోగి ప్రభుత్వం క్లారిటీ

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ను విభజించి, మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పందించింది. అలాంటి నిర్ణయం ఏదీ ఇంత వరకు జరగలేదని స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారపూరతమైనవేననీ.. రాష్ట్ర విభజన కోసం ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనలూ సిద్ధంకాలేదని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లిన దగ్గర్నుంచి... దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యూపీని విభజిస్తున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీని మూడు రాష్ట్రాలుగా విభజించనున్నట్టు మీడియాలోని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. పశ్చిమాన జిల్లాలన్నీ కలిపి హరిత ప్రదేశ్‌గా, ఏడు జిల్లాలను బుందేల్‌ఖండ్‌గా విభజించి.. మిగతా జిల్లాలను ఉత్తర ప్రదేశ్‌గా కొనసాగించనున్నట్టు వార్తలు వచ్చాయి. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే బీజేపీ పలు వేదికలపై ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 


ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ ఇవాళ యూపీ సమాచార శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాంటి వార్తలన్నీ నిరాధారమైనవనీ... రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని స్పష్టం చేసింది. ‘‘రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు..’’ అని యూపీ కేబినెట్ మంత్రి, అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-12T23:37:39+05:30 IST