ఆ విషయంలో మేం విఫలమయ్యాం: యోగి

ABN , First Publish Date - 2021-11-20T02:44:58+05:30 IST

గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమయ్యామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి మాటను వింటుందని..

ఆ విషయంలో మేం విఫలమయ్యాం: యోగి

లఖ్‌నవూ: గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమయ్యామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి మాటను వింటుందని అన్న ఆయన.. చర్చల ద్వారా ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం లఖ్‌నవూలో వ్యవసాయ చట్టాల రద్దుపై ఆయన పై విధంగా స్పందించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం చారిత్రక నిర్ణయమని ప్రధాని మోదీని యోగి కొనియాడారు. ప్రజాస్వామ్య విధానాన్ని మోదీ కొనసాగించారని, రైతుల అభిలాషకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.


మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు.రైతుల ఆందోళనలతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు.


క్షమాపణలు చెబుతున్నా..

‘‘మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.‘‘నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో... మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను... ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Updated Date - 2021-11-20T02:44:58+05:30 IST