UP Elections: అఖిలేష్ పోటీపై స్పందించిన సీఎం యోగి

ABN , First Publish Date - 2022-01-19T22:13:42+05:30 IST

అనంతరం యోగి మాట్లాడుతూ ‘‘పోటీ చేయాలనుకున్నవారు పోటీ చేయవచ్చు. అలాగే అఖిలేష్ కూడా పోటీ చేయొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదు. ఆ పార్టీ చాల వెనుకబడి ఉంది..

UP Elections: అఖిలేష్ పోటీపై స్పందించిన సీఎం యోగి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో్ పోటీకి సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అఖిలేష్ పోటీ చేయాలని అనుకుంటే చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజలు కోరితే అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని అఖిలేష్ ప్రకటించారు.


అనంతరం యోగి మాట్లాడుతూ ‘‘పోటీ చేయాలనుకున్నవారు పోటీ చేయవచ్చు. అలాగే అఖిలేష్ కూడా పోటీ చేయొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదు. ఆ పార్టీ చాల వెనుకబడి ఉంది. నిజానికి ఐదేళ్ల మా పాలనలో మాఫియా, గూండాలను రాష్ట్రం బయటికి తరిమికొట్టాం. అయితే జైల్లో వేశాం. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గూండాలను, మాఫియాను మళ్లీ దింపుతోంది. ఆ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో అందరూ వారే ఉన్నారు’’ అని అన్నారు.


ఇక భారతీయ జనతా పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ చేరికపై యోగి మాట్లాడుతూ ‘‘అపర్ణా యాదవ్ చేరిక పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. మోదీ డబుల్ ఇంజన్ పనిని గుర్తించి ఆమె పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.

Updated Date - 2022-01-19T22:13:42+05:30 IST