బిడ్డకు జన్మనిచ్చిన గంటల్లోనే యువతికి Marriage.. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే..
ABN , First Publish Date - 2021-07-18T16:24:09+05:30 IST
బిడ్డకు జన్మినిచ్చిన గంటల్లోనే ఓ యువతికి వివాహమైన ఘటన...
చెన్నై/వేలూరు : బిడ్డకు జన్మినిచ్చిన గంటల్లోనే ఓ యువతికి వివాహమైన ఘటన రాణిపేట జిల్లా వాలాజా ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. వాలాజాపేటకు చెందిన జ్యోతి (19), అదే ప్రాంతానికి చెందిన ఉదయకుమార్ (21) కు మధ్య చాలాకాలంగా ప్రేమవ్యవహారం నడుస్తోంది. వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా వుండ డంతో జ్యోతి గర్భం దాల్చింది. దాంతో తనను వివాహం చేసుకోవాలని జ్యోతి కోరగా, ఉదయ కుమార్ ముఖం చాటేశాడు. ఈ విషయం తెలుసు కున్న జ్యోతి తల్లిదండ్రులు... ఆమెకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆరోగ్యరీత్యా ఆమెకు అబార్షన్ చేయడం సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో జ్యోతికి నెలలు నిండడంతో రెండు రోజుల క్రితం వాలాజాపేట ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం ఒంటిగంటకు జ్యోతి బాత్రూంకు వెళ్లిన సమయంలో నొప్పులు అధికమై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను అక్కడే వదిలేసి పారి పోయేందుకు జ్యోతి ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నంలో ఉండగానే ఆమె ఆస్పత్రి ప్రాంగణంలో స్పృహకోల్పోయింది. ఇది గమనించిన సిబ్బంది ఆమెను మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.
అసలు విషయం తెలుసుకుని వారు వాలాజాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత అప్పటి కప్పుడే ఉదయకుమార్ను రప్పించారు. జ్యోతిని వివాహం చేసుకోకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయకుమార్ ఆమెను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో అప్పటికప్పుడు తాళి తెప్పించిన పోలీసులు.. వేకువజామున 4 గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలో వున్న విఘ్నేశ్వరాలయంలో ఆ జంటకు వివాహం జరిపించారు.