‘ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా...’
ABN , First Publish Date - 2021-06-19T16:26:55+05:30 IST
ఒక సంవత్సరం చిన్నవాడైన మహేశ్ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహం చేసుకుంది...
హైదరాబాద్ సిటీ/అల్వాల్ : అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. కార్ఖానా ప్రాంతానికి చెందిన మల్పరాజ్ యాకయ్య పెద్ద కుమార్తె రవళి(24) ప్రైవేటు ఉద్యోగి. హస్మత్పేట్ అంజయ్య నగర్ ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ తనకన్నా ఒక సంవత్సరం చిన్నవాడైన మహేశ్ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహం చేసుకుంది. భర్త, అత్తమామలతో కలిసి హస్మత్పేట్లోనే ఉంటోంది. గురువారం భర్త మహేశ్ ట్యాంక్ బండ్ వద్ద ఫొటోలు తీయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో రవళి వెంటనే ఇంటికి రావాలని, ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు తెలిపింది.
వెంటనే అతను ఇంటి పక్కన ఉండే శ్రావణికి ఫోన్ చేసి వెళ్లి చూడమని చెప్పాడు. ఆమె వెళ్లి చూడగా లోపలి నుంచి తలుపునకు లాక్ చేసి ఉండడంతో స్థానికుల సాయంతో డోర్ తెరిచి చూడగా అప్పటికే రవళి ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు రవళి తండ్రికి సమాచారం ఇచ్చారు. తండ్రి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.