యువకుడి అనుమానాస్పద మృతిపై వివాదం.. పోలీసుల వల్లేనంటూ..

ABN , First Publish Date - 2020-05-27T17:22:08+05:30 IST

మల్లేపల్లి సీతారాంబాగ్‌కు చెందిన ఓ యువకుడి మృతి చుట్టూ వివాదం ఏర్పడింది. అతడి మృతికి పోలీసుల వేధింపులే కారణం అని బంధువులు ఆరోపిస్తుండగా..

యువకుడి అనుమానాస్పద మృతిపై వివాదం.. పోలీసుల వల్లేనంటూ..

ఆత్మహత్య అంటున్న పోలీసులు

వారి వేధింపుల వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ


కవాడిగూడ/ రాంగోపాల్‌పేట్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మల్లేపల్లి సీతారాంబాగ్‌కు చెందిన ఓ యువకుడి మృతి చుట్టూ వివాదం ఏర్పడింది. అతడి మృతికి పోలీసుల వేధింపులే కారణం అని బంధువులు ఆరోపిస్తుండగా.. దానిని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... తమ సోదరుడు మహేష్‌ మరణంపై అనుమానాలు ఉన్నాయని.. పోలీసుల వేధింపుల వల్లే  మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబీకులు, స్నేహితులు మంగళవారం రాత్రి గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మహేష్‌ మృతికి పోలీసుల వేధింపులే కారణమని మహేష్‌ సోదరుడు విక్రమ్‌, అతడి స్నేహితులు మీడియా ముందు ఆరోపించారు. కేసు విషయమై మహేష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు పోలీసులు అతడితో వ్యవహరించిన తీరుకు సంబంధించిన సీసీ పుటేజీ ఎందుకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో ఒక్కడినే పంపించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో అతడి సెల్‌ఫోన్‌ను కానిస్టేబుల్‌ను అని చెప్పి లాక్కున్న వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. మహేశ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని.. విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 


పోలీసులు చెప్పిన ప్రకారం..

మహేష్‌(25) సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లో ఓ జువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. ఈనెల 23వ తేదీ సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనం(టీఎస్‌ 13 ఈజీ 25 53)పై  ఇంటికి వెళ్తుండగా ఆర్పీరోడ్డు వద్ద రహదారి దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేయగా గాంధీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె హైదర్‌బస్తీలో నివసిస్తున్న సుభాషిణి(35)గా గుర్తించారు. మహేష్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించి రాత్రి 7 గంటల సమయంలో పంపించేశారు. స్టేషన్‌ ఆవరణలో కొద్దిసేపు ఉండి బయటకు వెళ్లిపోయాడు. అతడు ఇంటికి వెళ్లలేదు. ఉదయం వరకూ కుమారుడు రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి విశ్వంబర్‌ గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందే మహేష్‌ స్నేహితుడికి ప్రమాదం గురించి ఫోన్‌ కాల్‌ వచ్చినట్టు కూడా సమాచారం. ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కుటుంబ సభ్యులు మహేష్‌ గురించి ఆ రోజు రాత్రి నుంచి గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ట్యాంక్‌బండ్‌లో మృతదేహం లభించిందని రాంగోపాల్‌పేట్‌ పోలీసులు తెలియజేశారు. గాంధీనగర్‌ పోలీసులు వెళ్లి చూసి చనిపోయింది మహేష్‌గా గుర్తించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడు 23వ తేదీ రాత్రి ఎలా వెళ్లాడనేది సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించామని పోలీసులు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి బన్సీలాల్‌పేట్‌, బైబిల్‌హౌస్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ ఔట్‌పోస్టు వరకు నడుచుకుంటూ వెళ్తున్న సీసీఫుటేజీని మృతుడి తండ్రి, బంధువులకు పోలీసులు  చూపించారు. 


మాకు సంబంధం లేదు : సీఐ 

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నమహేష్‌ మృతితో తమకెలాంటి సంబంధం లేదని గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 23వ తేదీ సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తూ ఓ మహిళను ఢీకొట్టాడని చెప్పారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి మహే్‌షను స్టేషన్‌కు తీసుకొచ్చామనీ, విచారణ అనంతరం అతడిని పంపించేశామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కర్ఫ్యూ నేపథ్యంలో వాహనంలో పంపిస్తామని చెప్పినా వినకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడని వివరించారు. మహేష్‌ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని మహేష్‌ తండ్రి విశ్వంబర్‌, అతడి బాబాయి రాజేందర్‌ కుటుంబసభ్యులకు వివరించామని చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత ట్యాంక్‌బండ్‌ చేరుకొని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-05-27T17:22:08+05:30 IST