అత్తింటి వారు చెట్టుకు కట్టేసి కొట్టడంతో.. అల్లుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-04T14:54:58+05:30 IST
అత్తింటి వారు చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని తట్టుకోలేక ..
హైదరాబాద్/బంజారాహిల్స్ : అత్తింటి వారు చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ టి. అంజయ్యనగర్కు చెందిన నగేష్, మల్లమ్మలకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు దుష్ముక్ లక్ష్మణ్ (26) పెయింటర్. ఎల్లమ్మబండలో ఉండే మేనత్త ఇంటికి వెళ్లినప్పుడు భవానీ అనే యువతిని చూసి ప్రేమించాడు. ఆమె గతంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకుందని తెలిసినా, పెద్దలను ఒప్పించి 2020 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. తర్వాత పని చేయకుండా తిరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇంతలో భవానీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది.
నాలుగు నెలలుగా లక్ష్మణ్ కూడా అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. నెల రోజుల క్రితం పాప పుట్టింది. మార్చి 31న పాప ఫంక్షన్ చేశారు. అదే రోజు రాత్రి భవానీ తల్లిదండ్రులు, బంధువులు పని విషయంలో లక్ష్మణ్ను నిలదీశారు. మాటామాటా పెరిగింది. లక్ష్మణ్ అక్కడి నుంచి అలిగి ఇంటి దారి పట్టాడు. ఇంతలో అత్తింటి వారు లక్ష్మణ్ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. రాత్రి మొత్తం అలాగే, కట్టేసి ఉంచారు. మరునాటి ఉద యం కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పడంతో కట్లు విప్పారు. అక్కడి నుంచి తప్పించుకున్న లక్ష్మణ్ అంజయ్యనగర్కు వచ్చి తల్లిదండ్రులు, బాబాయ్ కొడుకు సందీ్పకు జరిగిన విషయాన్ని చెప్పాడు. ఒంటి మీద దెబ్బలు చూపించాడు. ఆ రోజంతా అదే దిగులుతో ఉన్నాడు. రాత్రి బయటకు వెళతానని చెప్పి, తిరిగి రాలేదు. బాధలో ఉన్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇదిలా ఉండ గా లక్ష్మణ్ బాబాయి రాము ఉండే ఇంట్లోని సెల్లార్ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని రాము భార్య కళ గమనించింది. వెళ్లి చూడగా లక్ష్మణ్ ఫ్యాన్కు మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితికి చేరింది. లక్ష్మణ్ సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.