మీ భద్రతే.. మా బాధ్యత!
ABN , First Publish Date - 2022-01-18T05:02:28+05:30 IST
బస్సు ప్రయాణంపై ప్రయాణికులకు ఆసక్తి కలిగేలా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మీ భద్రతే.. మా బాధ్యత అనే నినాదాన్ని తీసుకువచ్చింది. బస్సు ఎక్కారా.. టిక్కెట్ తీసుకున్నారా.. అనే ఽధోరణికి స్వస్తి పలికింది.
ప్రత్యేక కార్యాచరణతో ఆర్టీసీ అడుగులు
ప్రతీ ప్రయాణికుడు దేవుడే అంటూ నినాదం
బస్సు ప్రయాణం ఎంచుకున్నందుకు ప్రయాణికులకు ధన్యవాదాలు
ఆర్టీసీ వినూత్న పంథా
కామారెడ్డి, జనవరి 17: బస్సు ప్రయాణంపై ప్రయాణికులకు ఆసక్తి కలిగేలా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మీ భద్రతే.. మా బాధ్యత అనే నినాదాన్ని తీసుకువచ్చింది. బస్సు ఎక్కారా.. టిక్కెట్ తీసుకున్నారా.. అనే ఽధోరణికి స్వస్తి పలికింది. క్షేమంగా ప్రయాణికులు గమ్యాలకు చేరుకోవాలని కోరుతూ ప్రతీ బస్సులోని కండెక్టర్, డ్రైవర్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతీ ప్రయాణికుడు దేవుడితో సమానమని బస్సు ప్రయాణం ఎంచుకున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఆర్టీసీ ప్రతిజ్ఞ
అందరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కండెక్టర్ విన్నపం.. టీఎస్ ఆర్టీసీకి స్వాగతం సుస్వాగతం మీ ప్రయాణం ఆర్టీసీ బస్సును ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు అంటూ ప్రతిజ్ఞ చేసి బస్సును ప్రారంభిస్తున్నారు. ప్రయాణం సురక్షితం సుఖమయం గా ఉండాలని ప్రతీ ప్రయాణికుడు కోరుకుంటాడు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అవగతం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ మీ కోసమే మేము అనే నినాదంతో ప్రయాణికుడి ముంగిట నిలబడుతున్నది ఆర్టీసీ. బస్సు ఎక్కారా.. టికెట్ తీసుకున్నామా.. బస్సు దిగిపోయారా.. ఇక తమకు ఎలాంటి సంబంధం లేదు అనే ధోరణికి చరమగీతం పాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణికుడికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. క్షేమంగా గమ్యానికి చేరుకోండి అంటూ ప్రతీ కండక్టర్, డ్రైవర్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. బస్సు ప్రయాణం చేసే ముందు ఉద్యోగులు ప్రతిజ్ఞను చదివి వినిపిస్తున్నారు.
ప్రయాణికుడే భగవంతుడు
ఫ ఆనంద్, డీఎం, కామారెడ్డి
ప్రయాణికుడే ఆర్టీసీకి దేవుడు. ఆర్టీసీ నడుస్తున్న ది కేవలం ప్రయాణికుల ద్వారానే. ఆర్టీసీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రజలను సురక్షితంగా గమ్యం చేర్చేందుకే పని చేస్తోంది. ప్రతీ బస్సులోను కండక్టర్, డ్రైవర్ బస్సు కదులుతున్న సమయంలో ప్రతిజ్ఞ చేయాలి. ప్రయాణికుల కోసమే ఆర్టీసీ ఉన్నదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రతిజ్ఞ ఉద్దేశ్యం.