చెడు ఎంత దుర్మార్గమైనా అంతిమ విజయం మంచినే : జగన్
ABN , First Publish Date - 2020-10-25T15:34:14+05:30 IST
లుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అమరావతి : తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని సీఎం తెలిపారు. ఆదివారం నాడు దసరా పండుగ సందర్భంగా జగన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు’ అని జగన్ పేర్కొన్నారు.
గవర్నర్ విజ్ఞప్తి..
మరోవైపు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ ధర్మం ఆధిపత్యాన్ని సూచిస్తుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేతులు శుభ్రపరుచుకోవటం మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ పండగను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేస్తూ రాజ్భవన్ నుంచి ప్రకటనను విడుదల చేశారు.