అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ.. కీలక విషయాలపై చర్చ
ABN , First Publish Date - 2020-09-23T00:41:03+05:30 IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.
అమరావతి/న్యూ ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కొద్దిసేపటి క్రితమే షాను కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న షా ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి నిశితంగా సీఎం వివరించారు.
ముఖ్యంగా.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానాలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా.. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను కూడా సీఎం జగన్.. షా దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ అంశాలపై అమిత్ షాకు విజ్ఞాపన పత్రాన్ని జగన్ అందజేశారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, బాలశౌరి ఉన్నారు.
కాగా.. షాతో భేటీ అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. ఇవాళ రాత్రి జగన్ అక్కడే బస చేసి బుధవారం ఉదయం జగన్ ఏపీకి తిరుగుపయనం కానున్నారు.