సిగ్గుంటే రాజీనామా చేయండి!
ABN , First Publish Date - 2020-05-31T16:30:47+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా..
సీఎంకు టీడీపీ నేత కోటంరెడ్డి సవాల్
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నుడా మాజీ చైర్మన్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసలురెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కోటంరెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్రెడ్డి వంటి వారు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే ఒక కేసులో తీర్పు వస్తే వెంటనే తమ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
అయితే మఖ్యమంత్రి జగన్ పాలనపై హైకోర్టు 65 సార్లు వ్యతిరేకంగా తీర్పులు వస్తే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఒక్క అవకాశమంటూ జగన్ ప్రజల చెవిలో అందమైన పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. వెంకటేశ్వ రపురం, అల్లీపురం, కొత్తూరు వంటి ప్రాంతాలలో పేదలకు మంచి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు గృహ సముదాయాలను నిర్మిస్తే వాటిని పేదలకు ఇస్తే చంద్రబాబుకు పేరు వస్తుందన్న దురుద్దేశంతో వాటిని ఇవ్వకుండా స్థలాలు అమ్మమని చెప్పడం సరికాదన్నారు.
మంత్రి అనిల్ ఇచ్చిన ఇళ్ల పంపిణీ హామీలపై స్పందించాలని అన్నారు. మధ్య నిషేధమంటూ క్వార్టర్ రూ.60 ఉంటే రూ.220కి పెంచిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు. కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఈ నిరసనలో టీడీపీ నేతలు పిట్టి సత్యనారాయణ, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, జెన్ని రమణయ్య, మామిడాల మధు, మహేంద్రరెడ్డి, తిరుమల నాయుడు, ఖాజావళి, ఆకుల హనుమంత రావు, జాఫర్, మల్లికార్జున, రమణయ్యనాయుడు, సుధాకర్బాబు, నారాయణ పాల్గొన్నారు.