రూటు మార్చుకున్న వైఎస్ షర్మిల!
ABN , First Publish Date - 2021-09-06T23:30:14+05:30 IST
నిరుద్యోగ దీక్షలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రూటు మార్చారు. రేపటి నుంచి యూనివర్సిటిల ముందు దీక్షలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: నిరుద్యోగ దీక్షపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రూటు మార్చారు. రేపటి నుంచి యూనివర్సిటీల ముందు దీక్షలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ముందు నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం యూనివర్సిటీ ముందు ఆందోళనలు చేయాలని భావిస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి అక్కడే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వరుసగా 8 చోట్ల ఉద్యోగ దీక్షలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు దీక్షలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండు చోట్ల కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. మంచిర్యాల జిల్లా సిరిసేడులో ఓ నిరుద్యోగి కుటుంబం షర్మిలను రావొద్దని విజ్ఞప్తి చేసింది.
ముందుగా అనుకున్నట్లు రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న 167 కుటుంబాలను షర్మిల పరామర్శించాలని అనుకున్నారు. అయితే ఆ సంకల్పానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని షర్మిల భావించారు. దీంతో ఆమె రూటు మార్చుకున్నారు. ఇందులో బాగంగానే రేపటి నుంచి (మంగళవారం) నుంచి యూనివర్సిటీల ముందు ఆందోళనకు సిద్దమవుతున్నారు.