వైఎస్ విజయలక్ష్మి ఆహ్వానం... రాలేనన్న అసదుద్దీన్

ABN , First Publish Date - 2021-09-01T20:57:50+05:30 IST

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంస్మరణ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు రావాలని ఆయన సతీమణి

వైఎస్ విజయలక్ష్మి ఆహ్వానం... రాలేనన్న అసదుద్దీన్

హైదరాబాద్: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంస్మరణ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు రావాలని ఆయన సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి 300 మందికి ఆహ్వానం పంపారు. సభలో 30 మంది ప్రసంగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. సంస్మ‌ర‌ణ స‌భ‌కు రాజ‌కీయ‌నేత‌ల‌తో పాటూ అన్ని రంగాల ప్ర‌ముఖుల‌కు విజయలక్ష్మి ఆహ్వానం పంపారు. ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. సినిమా రంగం నుంచి ప్ర‌ముఖ న‌టులు చిరంజీవి, నాగార్జున‌, సూప‌ర్‌ స్టార్ కృష్ణ‌, నిర్మాత దిల్ రాజుల‌కు ఆహ్వానం పంపారు. అలాగే రిటైర్జ్ జడ్జి సుదర్శన్‌రెడ్డి కూడా సభకు వస్తారని చెబుతున్నారు. 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో ప‌నిచేసిన ఉభ‌య రాష్ట్రాల మంత్రుల‌కు విజ‌య‌లక్ష్మి ఫోన్ చేసి ఆహ్వానించారు. 


వీరిలో టీఆర్ఎస్ నుంచి మంత్రి స‌బిత‌ ఇంద్రారెడ్డి, ఎంపీ డి. శ్రీనివాస్, మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ సునితా ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌ల‌ను ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ నుంచి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, జానారెడ్డి, దామోద‌ర రాజ‌న‌రసింహ‌, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీద‌ర్ బాబు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్, డీకే అరుణ‌ల‌కు ఆహ్వానం పంపారు. వీరితో పాటుగా ఎంఐఎం అధ్యక్షుడు అస‌దుద్దీన్‌ను కూడా ఆహ్వానించారు. అయితే విజయలక్ష్మి ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. వైఎస్సార్ అంటే అభిమానమే, కాని స‌భ‌కు రాలేన‌ని అసద్ తన సందేశాన్ని పంపారని చెబుతున్నారు. ప్రముఖ వైద్యులు, అడ్వ‌కేట్లు, మాజీ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ జ‌డ్జీల‌తో పాటూ వివిధ రంగాల ప్రముఖుల‌ను విజయలక్ష్మి ఆహ్వానించారు. టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కొందరు మాజీ మంత్రులనూ పిలవడం గమనార్హం. 



Updated Date - 2021-09-01T20:57:50+05:30 IST