పోలీసుల అదుపులో Viveka హత్య కేసు నిందితుడు...కడపకు తరలింపు
ABN , First Publish Date - 2021-11-18T13:59:14+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.
హైదరాబాద్/కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో అతడిని సీబీఐ అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును దస్తగిరి కన్ఫేషన్ స్టేట్మెంట్లో ప్రస్తావించారు. దాంతో విచారణకు రావాలని శివశంకర్ రెడ్డికి ఈనెల 15న సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శివశంకర్రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ కోసం సికింద్రాబాద్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో శివశంకర్ రెడ్డిని కడపకు తరలించారు. మరికాసేపట్లో నిందితుడు కడపకు చేరుకోనున్నారు. శివశంకర్ రెడ్డిని ఈరోజు పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చనుంది.