వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.100 కోట్లు

ABN , First Publish Date - 2022-01-21T05:07:30+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.100 కోట్లకుపైగా తమ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.100 కోట్లు
ఎరువుల గోడౌన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి

 ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి


తోటపల్లిగూడూరు, జనవరి 20 : సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.100 కోట్లకుపైగా తమ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తోటపల్లిగూడూరు పీఏసీఎస్‌లో   వ్యవసాయం, ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 1.40వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి ప్రధాన పంటగా సాగు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో రబీ సీజన్‌లో అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలు సబ్సిడీపై అందించినట్లు తెలిపారు. వైఎస్సార్‌ యంత్రసేవ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు రైతుభరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీ రూపంలో అందజేస్తున్నట్లు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎరువుల సమస్య లేకపోయినా ఉన్నట్లు కొందరు నాయకులు చిత్రీకరించారని పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యంగౌడ్‌, మాజీ జడ్పీటీసీ చిరంజీవిగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ కావల్‌రెడ్డి హరిచంద్రారెడ్డి, ఈదూరు రామాచార్యులు, పాకం ప్రవీణ్‌, ఎంపీడీవో హేమలత, ఎంఈవో గీతాకుమారి, సీఈవో నాగరాజు, ఈదూరు ప్రసాద్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:07:30+05:30 IST