4.54 లక్షల మంది రైతులకు రూ.340.49 కోట్ల లబ్ధి
ABN , First Publish Date - 2021-05-14T06:58:47+05:30 IST
జిల్లాలో 2021-22 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా కిసాన్ పథకం కింద తొలి విడతలో 4,54,005 మంది రైతులకు రూ.340.49 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి వెల్లడించారు.
- కలెక్టర్ మురళీధర్రెడ్డి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), మే 13: జిల్లాలో 2021-22 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా కిసాన్ పథకం కింద తొలి విడతలో 4,54,005 మంది రైతులకు రూ.340.49 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి వెల్లడించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన రైతు భరోసా పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీనిని కలెక్టరేట్లోని వివేకానంద హాలు నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. 4,39,220 మంది మైదాన ప్రాంత రైతుల ఖాతాల్లో రూ.329.41 కోట్లు, ఏజెన్సీ ప్రాంతాల్లోని 14,379 మంది ఆర్వోఎఫ్ఆర్ రైతుల ఖాతాల్లో రూ.10.78 కోట్లు జమ చేయనున్నామన్నారు. జిల్లాలో భూములను సాగుచేస్తున్న 406 మంది యానాం రైతులకు కూడా ఈ పధకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. వీరి ఖాతాల్లో రూ 30.44 లక్షలు జమ చేస్తామన్నారు. తొలి విడతలో ఖరీఫ్ పంట వేసే ముందు ప్రస్తుతం ఒక్కో రైతు కుటుంబం రూ.7,500 మేర లబ్ధి పొందుతుండగా ఈ ఏడాది అక్టోబరులో రెండో విడత, వచ్చే ఏడాది జనవరిలో మూడో విడత సొమ్ము విడుదలవుతుందని కలెక్టర్ చెప్పారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఒకవైపు కొవిడ్ రెండో దశ కలవరపెడుతున్నప్పటికీ ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులకు పంట పెట్టుబడికి అండగా ఉంటుందనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం తొలి విడత సాయాన్ని విడుదల చేసిందన్నారు.