మీ చెంతకే వైద్యం
ABN , First Publish Date - 2020-06-03T10:16:55+05:30 IST
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్న ..
పల్లెల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు
స్థల సేకరణలో అధికారులు నిమగ్నం
శృంగవరపుకోట, జూన్ 2: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని గ్రామాల్లో ఎక్కడో ఒక చోట నిర్మించేకంటే సచివాలయాలకు ఆనుకొని ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఆ మేరకు స్థల సేకరణకు చర్యలు చేపట్టాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో స్థల సేకరణ కోసం వైద్యాధికారులు రెవెన్యూ అధికారులను కోరారు. పల్లె వాసులకు క్షేత్ర స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించేందుకు స్థానిక కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవన్నీ సచివాలయాలకు దగ్గరగా ఉండేలా చూస్తోంది.
ఈ మేరకు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్లు ఒకే చోట ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ జరుగుతోంది. అత్యధిక గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. దీంతో స్థల సమస్య ఉంది. చాలా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు అతి కష్టం మీద సచివాలయాలకు స్థలాలను అందించారు. ఇప్పుడు ఇదే చోట వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు ఆరు సెంట్ల వరకు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ అడుగుతోంది. సచివాలయాలకు ఆనుకుని స్థలాలను ఇవ్వలేకపోయినా కనీసం దగ్గరలోనైనా ఇవ్వాలని వైద్యాధికారులు కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉప కేంద్ర భవనాలు ఉన్న చోట మాత్రం విస్తరణకు అవసరమైన స్థలం సేకరిస్తున్నారు. ఇక్కడ కూడా తాగునీరు, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్లు, భవనం చుట్టూ ప్రహరీ ఉండాలి. ఏఎన్ఎం క్వార్టర్కు పక్కన, లేదా భవనంపైన నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇలా సచివాలయ పరిధిలోనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ప్రభుత్వం నడపనుంది.