Municipality : బాబు కంచుకోట Kuppamలో YSRCP ఘన విజయం..
ABN , First Publish Date - 2021-11-17T20:19:10+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది....
చిత్తూరు జిల్లా : టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. ఊహించని రీతిలో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ మొత్తం 18 స్థానాల్లో గెలిచింది. టీడీపీ కేవలం 06 వార్డుల్లో మాత్రమే గెలిచింది. అయితే 14వ వార్డు వివాదాస్పద రీతిలో ఏకగ్రీవమైంది. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. అటు కుప్పంలో.. ఇటు వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.
పెద్దలు మకాం వేసి..!
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.. మొదలుకుని పోలింగ్ ముందు రోజు వరకూ వైసీపీ పెద్దలు, మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి.. అధికారం, డబ్బు.. దొంగ ఓట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చేయాల్సినవన్నీ చేసి ఎట్టకేలకు కుప్పంలో అధికార పార్టీని గెలిపించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను టీడీపీ అధినేత చంద్రబాబు.. కుప్పం తెలుగు తమ్ముళ్లు.. పోలీసులకు, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేకున్నా అధికార పార్టీ కావడం వల్ల ఉన్న అన్ని అనుకూలతలను వినియోగించుకుందని మొదట్నుంచీ టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉన్న విషయం విదితమే. అన్నట్టుగానే చివరికి వైసీపీ గెలిచింది.
నరాలు తెగే ఉత్కంఠ!
రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికలు జరగ్గా అందరి చూపు.. నరాలు తెగేలా ఉత్కంఠ మాత్రం.. కుప్పం మున్సిపాలిటీపైనే. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్.. 11 గంటలయ్యే సరికి దాదాపు గెలుపెవరిదన్న విషయం జనాలకు తెలిసిపోయింది. మొదటి రౌండ్లో 14 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడగా.. ఇందులో వైసీపీ 12 స్థానాల్లో గెలవగా.. టీడీపీ కేవలం 02 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక రెండో రౌండ్లోనూ సేమ్ సీన్ రిపిట్ అయ్యింది. అంతేకాదు.. నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొందరు పోటీ చేయగా వారు కూడా ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.
ఏ పార్టీకి ఎన్నొచ్చాయ్..!
మొత్తం : 25 వార్డులు
ఏకగ్రీవాలు : 01 వార్డు మాత్రమే
ఎన్నికలు జరిగినవి : 24 వార్డులు
టీడీపీ : 06 వార్డులు
వైసీపీ : 18 వార్డులు