తెలంగాణ నా గడ్డ.. ఇది రియాలిటీ: షర్మిల
ABN , First Publish Date - 2021-07-16T18:06:31+05:30 IST
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముమ్మాటికీ తెలంగాణకి వ్యతిరేకి కాదని వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి కాదని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ తెలంగాణకు మంచి చేశారా..ద్రోహం చేశారా..గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. వైఎస్ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని తెలిపారు. మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని షర్మిల అన్నారు. ‘‘తెలంగాణ నా గడ్డ.. ఇది రియాలిటీ’’ అని తెలిపారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్ టీపీ అని స్పష్టం చేశారు. అలిగితే పుట్టింటికి వెళ్లకుండా పార్టీ పెడతామా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు.
తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది.. పెట్టామని వైఎస్సార్ టీపీ అధినేత తెలిపారు. కృష్ణా జలాల అంశాలను కేసీఆర్ ఏనాడైనా సీరియస్గా తీసుకున్నారా అడిగారు. సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్ జరిగితే మహిళా సర్పంచ్కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని..వ్రతాలు చేసుకోవాలి షర్మిల వ్యాఖ్యానించారు.