కాన్పూరులో Zika virus కలవరం...89కి పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2021-11-08T12:41:56+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో జికా వైరస్ కలవరం రేపుతోంది...

కాన్పూరులో Zika virus కలవరం...89కి పెరిగిన కేసులు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో జికా వైరస్ కలవరం రేపుతోంది. కాన్పూర్ నగరంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషనులో పనిచేస్తున్న వాయుసేన సిబ్బంది 10 మందికి జికా వైరస్ పాజిటివ్ అని తాజాగా జరిపిన పరీక్షల్లో తేలింది. కాన్పూర్ నగరంలో 89 మందికి జికా వైరస్ సోకడంతో జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జికా వైరస్ సోకిన 89 మందిలో 55 మంది పురుషులు, 34 మంది మహిళలున్నారు. మరో 23 మంది 21 ఏళ్ల వయసు లోపు యువకులు జికా వైరస్ బారిన పడ్డారు. జికా వైరస్ నివారణకు చర్యలు చేపట్టామని కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ విషాక్ జి అయ్యర్ చెప్పారు. 


కాన్పూర్ జిల్లాలో మూడు రోజుల పాటు 525 మంది రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌లకు తరలించామని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. వీరిలో మరో 23 మందికి జికా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషనుకు 3 కిలోమీటర్ల దూరంలో నివశిస్తున్న వారికి జికా వైరస్ సోకిందని వెల్లడైంది. జికా వైరస్ మొదటి కేసు అక్టోబరు 23వతేదీన కాన్పూర్ వాయుసేన కేంద్రంలో వెలుగుచూసింది. 


దోమల వల్ల వ్యాప్తి చెందుతున్న ఈ జికా వైరస్ ను నివారించేందుకు వీలుగా దోమలను అరికట్టేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. కాన్పూర్ వాయుసేన కేంద్రంలో జికా వైరస్ ప్రబలడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జికా వైరస్ నివారణకు వీలుగా ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లా అధికారులు వివరించారు.


Updated Date - 2021-11-08T12:41:56+05:30 IST