బీజేపీలా దేవుడి పేరు మీద బీఆర్ఎస్ ఓట్లడగలేదు: కేటీఆర్

తిరుపతికి ధీటుగా యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిని అభివృద్ధి చేసినా.. బీజేపీలా దేవుడి మీద ఓట్లడగలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

కేటీఆర్ మే 19న బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో బీఆర్ఎస్ కేడర్‌తో ప్రచారంపై సమీక్షించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ హ్యట్రిక్ విక్టరీ కొడుతుందని కేటీరామారావు ధీమా వ్యక్తం చేశారు. 

చేసిన పనిని చెప్పుకోకపోవడం, కొన్ని వర్గాలను దూరం చేసుకోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.

అయోధ్య పేరుతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారని.. తాము యాదగిరి గుట్ట కట్టినా దేవుడి పేరుతో ఎన్నడూ ఓట్లు అడగలేదని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని  కోరారు.