తొలిరోజు 15 నామినేషన్లు
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:31 AM
సార్వతిక్ర ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. కట్టుదిట్టమైన పోలీసు బంధోబస్తు నడుమ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. తొలిరోజైన గురువారం చిత్తూరు (ఎస్సీ) పార్లమెంటు స్థానానికి 01, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గాలకు బోణీ కాలేదు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18: సార్వతిక్ర ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. కట్టుదిట్టమైన పోలీసు బంధోబస్తు నడుమ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. తొలిరోజైన గురువారం చిత్తూరు (ఎస్సీ) పార్లమెంటు స్థానానికి 01, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గాలకు బోణీ కాలేదు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే లోనికి అనుమతించారు. డీఎస్పీ హోదా కల్గిన అధికారి నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ సెలవు రోజు మినహా ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతుంది.
చిత్తూరు (ఎస్సీ) పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ తరఫున దగ్గుమళ్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ షన్మోహన్ నామినేషన్ స్వీకరించారు.
పుంగనూరు స్థానానికి టీడీపీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి, చల్లా పూజారెడ్డి, కాంగ్రెస్ నుంచి జి.మురళీమోహన్, సోషియల్ డెమాక్రెటిక్ పార్టీ నుంచి ఖాన్దాది షేక్ అన్వర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు.
నగరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి జి.భానుప్రకాష్ నామినేషన్ వేశారు.
గంగాధరనెల్లూరు(ఎస్సీ)కు టీడీపీ తరఫున గాంధీ రత్నవేలు, స్వతంత్ర అభ్యర్థిగా ఉసురుపాటి పద్మనాభం నామినేషన్ దాఖలు చేశారు.
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి మూడు సెట్లు, టీడీపీ అభ్యర్థి జీసీ జగన్మోహన్ రెండుసెట్ల నామినేషన్ వేశారు.
పలమనేరు నియోజకవర్గానికి వైసీపీ తరఫున ఎన్.వెంకటేగౌడ, ఎన్.పావని నామినేషన్ దాఖలు చేశారు.
భారీ జనసందోహంతో భానుప్రకాష్ నామినేషన్
నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ భారీ జన సందోహంతో తరలివచ్చి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి తెలుగుతమ్ముళ్లు స్వచ్ఛందంగా తరలివచ్చారు. పదివేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. వినాయకస్వామి ఆలయం నుంచి ర్యాలీగా టవర్క్లాక్ మీదుగా తహసీల్దారు కార్యాలయానికి తరలివెళ్లారు. పార్టీ నేత ప్రతాప్రాజు ప్రతిపాదించగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవీరెడ్డిలతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు.