రెండో రోజు 20 నామినేషన్లు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:49 AM
జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 చొప్పున మొత్తం 20 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తిరుపతి ఎంపీకి 3... ఏడు అసెంబ్లీ స్థానాలకు 17
తిరుపతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 చొప్పున మొత్తం 20 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ డమ్మీ అభ్యర్థిగా గురుమూర్తి సతీమణి నవ్యకిరణ్ నామినేషన్ వేశారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ, గూడూరులో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్ళూరుపేటలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె డాక్టర్ విజయశ్రీ, సత్యవేడులో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నామినేషన్లు వేశారు.రెండు సెగ్మెంట్లలో వైసీపీ, మరో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. గూడూరులో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి నామినేషన్లు వేశారు. చంద్రగిరిలో కాంగ్రెస్ తరపున శ్రీనివాసులు అలియాస్ వాసు, సూళ్ళూరుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గాదె తిలక్ బాబులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆరు చోట్ల ఇతరుల నామినేషన్లు :
గూడూరులో టీడీపీ డమ్మీ అభ్యర్థిగా గోను సంధ్యారాణి, సూళ్ళూరుపేటలో వైసీపీ డమ్మీ అభ్యర్థిగా కిలివేటి సుభాషిణి, వెంకటగిరిలో టీడీపీ డమ్మీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున షేక్ షఫీ, ఇండిపెండెంట్గా ఉయ్యూరు ఆర్ముగం, తిరుపతిలో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ నుంచీ ఎల్.ఎన్.లక్ష్మి, ఇండిపెండెంట్గా కె.కాంతారావు, శ్రీకాళహస్తిలో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున రమేష్, సత్యవేడులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జడ్డా రాజశేఖర్ నామినేషన్లు వేశారు.