Share News

పూరీ విమానాశ్రయ అభివృద్ధి రేసులో జీఎంఆర్‌!

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:02 AM

ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ సమీపంలో సిపాసారుబాలీ వద్ద ఏర్పాటు చేయనున్న కొత్త విమానాశ్రయ అభివృద్ధికి అదానీ గ్రూప్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, ఫెయిర్‌ఫాక్స్‌ పోటీపడుతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో...

పూరీ విమానాశ్రయ అభివృద్ధి రేసులో జీఎంఆర్‌!

అదానీ గ్రూప్‌, ఫెయిర్‌ఫాక్స్‌ కూడా..

హైదరాబాద్‌: ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ సమీపంలో సిపాసారుబాలీ వద్ద ఏర్పాటు చేయనున్న కొత్త విమానాశ్రయ అభివృద్ధికి అదానీ గ్రూప్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, ఫెయిర్‌ఫాక్స్‌ పోటీపడుతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఒడిశా ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఐడీసీఓ) రూ.2,203 కోట్ల పెట్టుబడితో ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐడీసీఓ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 26న జరిగిన రెండో ప్రీ-బిడ్‌ సమావేశంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, ఫెయిర్‌ఫాక్స్‌, జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి, అనుమతులు, కాలపరిమితికి సంబంధించి పలు ప్రశ్నలను మూడు కంపెనీల ప్రతినిధులు లేవనెత్తగా మే 10న వీటికి సంబంధిత అధికార వర్గాలు సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వివరాలను అందుకున్న తర్వాత ఆసక్తి కలిగిన బిడ్డర్లు తమ టెండర్‌ను జూన్‌ 4వ తేదీ వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే నెల 5న టెండర్‌ను తెరవనున్నారు.


2,203 కోట్లతో అభివృద్ధి: ఈ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని మొత్తం 1,184 ఎకరాల్లో రూ.2,203 కోట్లతో ఐడీసీఓ అభివృద్ధి చేయనుంది. తొలి దశలో ఏటా 46 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆ తర్వాత రెండో దశలో ఏటా 1.01 కోట్ల మంది, మూడో దశలో 1.66 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా అభివృద్ధి చేయాలని ఐడీసీఓ నిర్ణయించింది. ఈ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు ఐడీసీఓ నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేయనుంది. అయితే తొలిదశలో అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలనే అంశం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుందని ఐడీసీఓ స్పష్టం చేసింది.

Updated Date - Apr 28 , 2024 | 02:02 AM