కాంగ్రెస్కు ఓట్లడిగే అర్హత లేదు
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:45 AM
అసెంబ్లీ ఎన్నికలలో బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎర్రగడ్డ డివిజన్లో ఆయన
ఆ రెండు పార్టీలది కుటుంబ పాలన: కిషన్ రెడ్డి
కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: లక్ష్మణ్
ఎర్రగడ్డ/ఖైరతాబాద్/హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలలో బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎర్రగడ్డ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రేమ్నగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద, ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన కార్నర్ పాయింట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది కుటుంబ పాలన అని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పాలనలో తన కుటుంబ సభ్యులకే పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను ఎక్కడ నెరవేర్చారని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజలు సురక్షితంగా, సుసంపన్నంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇప్పుడు కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఓఎల్ఎక్స్లో పెట్టినా కొనేవారు లేరని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదన్నారు. ఉమ్మడి ఏపీలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులుగా వచ్చిన రొహింగ్యాలకు మజ్లిస్ నాయకులు ఆధార్ కార్డులు కూడా ఇప్పించారని ఆయన ఆరోపించారు.