పిల్లి తీర్థయాత్రలా కేసీఆర్ బస్సు యాత్ర
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:21 AM
వంద ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు బయలుదేరినట్లుగా కేసీఆర్ బస్సుయాత్ర ఉందంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఇప్పుడు ప్రజల వద్దకు వెళుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను
పాపాలకు ప్రాయశ్చిత్తంగానే ప్రజల వద్దకు: ఆది శ్రీనివాస్
ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా.. మోదీ?: వీహెచ్
కాంగ్రె్సకు ఆర్పీఐ మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): వంద ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు బయలుదేరినట్లుగా కేసీఆర్ బస్సుయాత్ర ఉందంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఇప్పుడు ప్రజల వద్దకు వెళుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తర్వాత కేసీఆర్ బస్సు ఎక్కాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆనాడు అధికార మదంతో ప్రగతిభవన్, ఫాంహౌ్సల గేట్లు కూడా దాటలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే ఇప్పుడు బస్సు యాత్రకు బయలుదేరారన్నారు. రోజుకో కొత్త మాట చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా అమలు చేశారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. జై శ్రీరాం నినాదం తప్ప.. ప్రజల పరిస్థితి ఎలా ఉందో పట్టించుకునే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాహుల్ ప్రధాని అయితేనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రె్సకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) మద్దతు ప్రకటించింది. టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ను కలిసిన ఆ పార్టీ ప్రతినిధులు ఈ మేరకు మద్దతు పత్రాన్ని అందించారు.
కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ యాత్ర..
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ టీపీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో విజయసంకల్ప యాత్ర-2 గాంధీభవన్లో ప్రారంభమైంది. మహేశ్ కుమార్గౌడ్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.