Share News

వలస పక్షులకు ఓటేస్తే కనిపించరు

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:47 AM

‘ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షులకు ఓట్లేసి గెలిపిస్తే మీ సమస్యలు చెప్పుకోవడానికి దొరకరు. కనిపించకుండా పోతార’ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, సునీతా రెడ్డిని ఆయన వలస

వలస పక్షులకు ఓటేస్తే కనిపించరు

అబద్ధాలు, అప్పులతో రేవంత్‌ పాలన

కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో అసహనం

బీజేపీ, కాంగ్రెస్‌ చీకటి దోస్తులు: కేటీఆర్‌

శామీర్‌పేట/సిరిసిల్ల, ఏప్రిల్‌ 24: ‘ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షులకు ఓట్లేసి గెలిపిస్తే మీ సమస్యలు చెప్పుకోవడానికి దొరకరు. కనిపించకుండా పోతార’ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, సునీతా రెడ్డిని ఆయన వలస పక్షులతో పోల్చారు. బుధవారం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్‌, అనంతరం రోడ్‌ షోలో కేటీఆర్‌ పాల్గొన్నారు. శామీర్‌పేట మండలం దొంగల మైసమ్మ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్‌ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే మూడు నెలలుగా సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలు, అప్పులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌నే గుర్తు చేసుకుంటున్నారన్నారు. శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయితీ లేదని, మోదీ అక్షింతలు పంపిస్తే, కేసీఆర్‌ తినడానికి బియ్యం పంపించారన్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశాల్లో కూడా కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో అసహనం పెరిగిందని, కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడాను ప్రజలు తెలుసుకున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ చీకటి దోస్తులని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టిందని ఆరోపించారు.

Updated Date - Apr 25 , 2024 | 04:47 AM